‘ఫార్ములా ఈ రేస్ లొట్టపీసు కేసు.. కక్ష సాధింపు’: ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతల అగ్గిమీద గుగ్గిలం

Best Web Hosting Provider In India 2024

‘ఫార్ములా ఈ రేస్ లొట్టపీసు కేసు.. కక్ష సాధింపు’: ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతల అగ్గిమీద గుగ్గిలం

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిప్పులు చెరిగారు.

తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిప్పులు చెరిగిన కేటీఆర్, హరీష్ రావు

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిప్పులు చెరిగారు.

ఏసీబీ విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్, ఫార్ములా ఈ కార్ రేస్‌ను “ముమ్మాటికీ లొట్టపీసు కేసే” అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ, “ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలవాలి అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం కావాలని డిమాండ్ చేశాను కానీ రాలేదు” అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఉదయం 10 గంటల నుంచి ఏసీబీ అధికారులు “అడిగిందే అడుగుడు, అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నరు” అని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. “చిట్టి నాయుడు పంపిన ప్రశ్నలే అడుగుతున్నారు” అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

“వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. “అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసీఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నడు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తనపై 14 కేసులు పెట్టారని, ఇంకా 14,000 కేసులు పెట్టుకున్నా భయపడబోనని కేటీఆర్ అన్నారు. “పిలుచుడు, చాయి తాపిచ్చుడు, తిప్పి తిప్పి ప్రశ్నలు అడుగుడు” అంటూ ఏసీబీ విచారణ తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను “చిత్తు చిత్తుగా ఓడించాలి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 21న సంబరాలు చేసుకుందామని, కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలని ఆయన సూచించారు. “కేసులు, విచారణ పాత చింతకాయ పచ్చడే. నీలాగా లుచ్చా పనులు చేసి, అడ్డంగా డబ్బు కట్టలతో దొరికిన వాడు లేడు. అడ్డదారిలో పదవులు కొనుక్కొని పీసీసీ ప్రెసిడెంట్ అయిన వాడు లేడు” అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

హరీష్ రావు ఆగ్రహం

కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు” అని ఆరోపించారు.

“రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టాడు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి” అని హరీష్ రావు డిమాండ్ చేశారు. “దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి?” అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ఫార్ములా ఈ రేసు విషయంలో కేటీఆర్ చేసిన కృషిని హరీష్ రావు కొనియాడారు. “కేటీఆర్ గారు ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్కు ఫార్ములా ఈ రేసును తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి మాత్రం ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించమని తేల్చి చెబితే తెలంగాణలో నిర్వహించి ఈ దేశ పరువు, రాష్ట్ర పరువు తీశాడు” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

“రేవంత్ రెడ్డి పాలనలో తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, లఘుచర్ల రైతులకు బేడీలేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులు” అని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా “కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి” అని హరీష్ రావు ఉద్ఘాటించారు. “లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్ ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు, తస్మాత్ జాగ్రత్త” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

టాపిక్

KtrHarish RaoAcbFormula E Race Case
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024