రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరు మార్పు..! కేంద్రానికి టీటీడీ ప్రతిపాదన, మరికొన్ని నిర్ణయాలివే

Best Web Hosting Provider In India 2024

రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరు మార్పు..! కేంద్రానికి టీటీడీ ప్రతిపాదన, మరికొన్ని నిర్ణయాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

రేణిగుంట ఎయిర్‌పోర్టు విషయంలో కేంద్రానికి టీటీడీ కీలక ప్రతిపాదన పంపనుంది. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు పెట్టాలని కోరనుంది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్‌ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్‌ వెల్లడించారు.

రేణిగుంట విమానాశ్రయం

తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌ాలనే ప్రతిపాదనను టీటీడీ తెరపైకి తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర విమాన‌యానశాఖ‌కు సిఫార్సు చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

తిరుమ‌ల‌లోని టీటీడీ చైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం టీటీడీ ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

స‌మావేశంలోని ముఖ్యాంశాలు:

•⁠ ⁠ఇటీవ‌ల క‌ర్ణాట‌క సీఎం, డిప్యూటీ సీఎంల‌ను క‌లిసిన సంద‌ర్భంగా వారి అభ్య‌ర్థ‌న మేర‌కు బెంగుళూరులోని ప్ర‌ధాన ప్రాంతంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని నిర్ణ‌యం. ఇందుకు కావాల్సిన 47 ఎక‌రాల స్థ‌లాన్ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కేటాయించ‌గానే ఆల‌యం నిర్మించేందుకు చ‌ర్య‌లు.

•⁠ ⁠కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ హెచ్‌.డీ.కుమార స్వామి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి టీటీడీకి 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కేటాయించేందుకు ముందుకు రావ‌డంతో త్వ‌ర‌లోనే బ‌స్సులను తిరుమ‌ల‌కు తీసుకొచ్చేందుకు చర్య‌లు.

•⁠ ⁠కేంద్ర ప్ర‌భుత్వం తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న సీఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజు ప‌ద్ధ‌తిలో టీటీడీ స్థ‌లాన్ని కేటాయించాల‌ని నిర్ణ‌యం. త‌ద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌ను ఉచితంగా త‌నిఖీ చేసేందుకు అవ‌కాశం.

•⁠ ⁠న్యూఢిల్లీలోని ప్ర‌తిష్టాత్మ‌క టీటీడీ క‌ళాశాల‌ను ఆధునీక‌రించాల‌ని నిర్ణ‌యం.

•⁠ ⁠టీటీడీలోని లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీని నిలిపివేయాల‌ని ఏపీపీఎస్సీకి సిఫార్సు. ఇప్ప‌టికే ప‌ని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు.

•⁠ ⁠సమరసతా సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణా కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.

•⁠ ⁠విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పిన మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ.

•⁠ ⁠టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం.

•⁠ ⁠వరలక్ష్మీ వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.

•⁠ ⁠అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత అనుష్టాన బోధన, భజే శ్రీనివాసం, వన-నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు.

•⁠ ⁠జూన్ 21 న యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ పరిపాలన భవనం గ్రౌండ్ నందు కార్యక్రమం.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

TtdAndhra Pradesh NewsAirport Photos
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024