



Best Web Hosting Provider In India 2024

పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచండి – సీఎం చంద్రబాబు
పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలని సూచించారు.ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలన్నారు.
పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని… వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల -3, గుంటూరు–2, పలనాడు -1, ప్రకాశం – 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతీ పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు.
గ్రేడింగ్ విధానాలు అమలు చేయండి – సీఎం చంద్రబాబు
పామ్ ఆయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.
ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు రూ.4 చొప్పున అదనంగా మద్ధతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఏడాదిలో కోకో 12 వేల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతీ రోజూ 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపోందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు.
టాపిక్