




Best Web Hosting Provider In India 2024

బనకచర్ల ప్రాజెక్ట్ : ‘మా ప్రయోజనాలు వదులుకోం… ఏ అన్యాయాన్నీ సహించం’ – సీఎం రేవంత్ రెడ్డి
బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బనకచర్లపై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి… మీడియాతో మాట్లాడారు.
బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి… తెలంగాణ హక్కులను రక్షించే పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు సూచించారు. తెలంగాణపై జరిగే ఏ అన్యాయాన్నీ సహించమని స్పష్టం చేశారు.
కలిసికట్టుగా ముందుకు వెళ్తాం – సీఎం రేవంత్
“మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రకటించారు. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
“ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సమబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తాం. పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దాం. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళతాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
“మా ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టులు పూర్తిగా కడితే వరద ఎంత వస్తుందో తెలిసేది.. మోడీకి చంద్రబాబు.. చంద్రబాబుకు మోడీ అవసరం ఉంది. అధికారం మీకు, నీళ్లు మాకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మోదీ మీరు చెబితే వినొచ్చు.. కానీ, మా ప్రయోజనాలు వదులుకోం. మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మిగులు జలాలు 3 వేల టీఎంసీల నీళ్లు ఉంటే మా వాటా వాడుకునేందుకు క్లియర్ చేయండి.. గోదావరిలో మా హక్కుగా ఉన్న 968 టీఎంసీల వినియోగానికి అనుమతించండి. మేం మా వాటాను వాడుకున్నాక.. మీ నీరును మీరు వాడుకోండి” అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
మరోవైపు ఎంపీల అఖిలపక్ష సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయంగా మాట్లాడుతున్నారంటూ రవిచంద్ర వెళ్లిపోయారు.
టాపిక్