




Best Web Hosting Provider In India 2024

‘బనకచర్ల’పై పోరుబాట…! సిద్ధమవుతున్న బీఆర్ఎస్, రంగంలోకి కేసీఆర్…!
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం తెరపైకి వచ్చింది. ఏపీ సర్కార్ చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టే ఇందుకు కారణమైంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష భేటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా, గోదావరి జలాల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి సరిగా లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నీళ్ల వివాదం షురూ అయింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల విషయంలో వివాదాలు కొనసాగుతుండగా… తాజాగా బనకచర్ల ప్రాజెక్ట్ తో నేతల మధ్య మాటలు పేలుతున్నాయి. ఇదే విషయంపై గత కొంత కాలంగా ప్రతిపక్ష బీఆర్ఎస్… రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ సర్కార్ జల దోపిడికి దిగుతుంటే… ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తోంది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కూడా వివరాలను ప్రజల ముందు వచ్చే ప్రయత్నాలు కూడా చేసింది.
బనకచర్లపై పోరాటం…!
ఏపీ సర్కార్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ పై భారీ పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయాలని చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని… సర్కార్ వైఖరిని ఎండగట్టేలా ముందుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలోనే కార్యాచరణను వెల్లడించనుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే… ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బనకచర్ల ప్రాజెక్ట్ విషయంపై తాజాగానే తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు బీఆర్ఎస్ కూడా హాజరైంది. ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాటి కేసీఆర్ – జగన్ భేటీని ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలను సంధించారు. కేసీఆర్, హరీశ్ రావ్ వైఖరి వల్లే బనకచర్ల ప్రాజెక్ట్ కు బీజం పడిందని ఆరోపించారు. సీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ ఆనాడే జగన్కు హామీ ఇచ్చారన్నారు. ఆనాడు కేసీఆర్, జగన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే చంద్రబాబు ఇప్పుడు ముందుకు వెళుతున్నారని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ… బీఆర్ఎస్ ఈ భేటీని వాకౌట్ చేసి బయటికి వచ్చేసింది.
తాజా పరిస్థితుల నేపత్యంలో బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బలమైన ఒత్తిడిని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా చూడాలని డిమాండ్ చేస్తూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా పోరాటం చేయనుంది.
రంగంలోకి కేసీఆర్ – నేతలకు దిశానిర్దేశం…!
మరోవైపు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం, నాడు ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తిచేయకుండా ఉద్దేశపూర్వకంగా సాగదీయడం వంటి వాటిపై పోరాటం చేయాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది.
ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పట్టించుకోకుండా వదిలివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…. పార్టీ నేతలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పకనబెట్టడంపై పోరాటం చేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేయనుంది. అంతేకాకుండా మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడటం సరికాదనే విషయంపై పోరాటం చేయనుంది. చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ నేరుగా… నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.
ఓవైపు ఏపీ సర్కార్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ తో పాటు రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల పూర్తి, పునరుద్ధరణ పనుల విషయంలో కూడా పోరుబాట పట్టేందుకు గులాబీ నాయకత్వం సిద్ధమవుతోంది. పక్కా ప్రణాళిక, కార్యాచరణతో ఈ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది. రేపోమాపో వీటన్నింటిపై క్లారిటీ రానుంది.
టాపిక్