




Best Web Hosting Provider In India 2024

యోగాంధ్ర – 2025 : విశాఖలో ‘యోగా డే’ గ్రాండ్ సక్సెస్, ఇదో చారిత్రక విజయం – సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన యోగా డేలో మాట్లాడిన ఆయన… 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని విశాఖలో జరుపుకోవడం ఏపీకి దక్కిన గౌరవం అని వ్యాఖ్యానించారు.
యోగా సాధన మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…. “దేశం, ప్రాంతం, మతం, భాషతో సంబంధం లేకుండా యోగాకు ఆమోదం లభించింది. శరీరం, మనస్సు, ఆత్మలను కలిపేందుకు యోగానే మార్గం. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఒత్తిడిని అధిగమించవచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. యోగా హింసను తగ్గిస్తుంది. శాంతిని ప్రోత్సహిస్తుంది. ఏఐతో సహా టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యోగా మరింత విస్తృతమైంది” అని అన్నారు.
ప్రధాని మోదీతోనే గుర్తింపు – సీఎం చంద్రబాబు
యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని చంద్రబాబు గుర్తు చేశారు. “యోగాకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రధాని మోదీ యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు. మోదీ చొరవతో మన భారతదేశ సంస్కృతి అయిన యోగాను 175కు పైగా దేశాలలో, 12 లక్షల ప్రదేశాలలో, 10 కోట్ల మందికి పైగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు.” అని చంద్రబాబు చెప్పారు.
యోగాంధ్ర – ఒక చారిత్రక విజయం
ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించి, విశాఖకు వచ్చి యోగా డేలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధాని మోదీ విజన్తో స్ఫూర్తి పొంది, ఏపీలో ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర ప్రచారాన్ని నిర్వహించాం. దీంట్లో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి, 1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టాం. విశాఖపట్నంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఇక్కడ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాం. మొత్తం 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశాం. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం మనకు గర్వకారణం.” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒలంపిక్స్ లో చేర్చాలి…
“యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా.. వివిధ దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారు. సెప్టెంబర్లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కానుండడం ఆనందంగా ఉంది. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలలో చేర్చేలా ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి దార్శనికత, గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహించడం వల్ల, యోగా ఇప్పుడు ఉద్యమంగా మారింది. చరిత్ర సృష్టించాలన్నా.. రికార్డులు బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోదీకే సాధ్యం” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీలో నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఇక్కడికి వచ్చిన వారితో పాటు.. యోగాడేలో పాల్గొన్న వారంతా చారిత్రాత్మకమైన కార్యక్రమంలో పాల్గొన్నట్టే. తెలుగు ప్రజలు 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలా యోగా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని ఆచరించి, జీవన విధానంగా మార్చుకుని అందర్లో చైతన్యం తీసుకువస్తూ…తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.
టాపిక్