




Best Web Hosting Provider In India 2024

రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ మరో నిర్ణయం – ఇకపై వారికి 5 రోజుల ముందుగానే సరఫరా..!
ఏపీలో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెల రేషన్ పంపిణీని … ఈ నెలాఖారు నుంచే ప్రారంభిస్తారు.
రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ అందనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ల ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ సరుకులను అందజేయనుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జులైలో ఇవ్వాల్సిన రేషన్ ను…. జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద రేషన్ అందించాలని నిర్ణయించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి – మంత్రి నాదెండ్ల
విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్… చౌకధర దుకాణదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రేషన్ సరుకుల పంపిణీ మొదటి 15 రోజుల్లోనే 89.64% విజయవంతంగా పూర్తి కావడం ఓ గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డు దారులకు సరుకుల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇప్పటివరకు 1,30,94,539 మందికి రేషన్ సరుకులు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాక, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఐదు రోజులు ముందుగానే ప్రతినెల 26వ తేదీ నుంచి 30 తేదీ లోపు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందజేయాలన్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు మరియు కొండలపైన ఉన్న ప్రజలకు… రేషన్ షాప్ కు దూరంలో ఉన్న ప్రజలకు సరుకులు అందించే విషయంలో డీలర్లు చొరవ చూపాలన్నారు. అందుకు క్యాలెండర్ ను డిస్ ప్లే చేయాలని సూచించారు.
సుదీర్ఘమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో కూటమి ప్రభుత్వం డీలర్ ఆదాయం పెంచేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. ప్రతి డీలరు తమ షాపును శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా షాపు బయట స్టాక్ బోర్డ్ మరియు ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ తో కూడిన పోస్టర్ ను విధిగా ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
డీలర్లు పోటీ మనస్తత్వంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించినప్పుడే మార్పు సాధ్యమన్నారు. పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందుకు డీలర్లు కూడా సిద్ధం కావాలన్నారు. రేషన్ తీసుకునే కుటుంబాల సంఖ్య గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. చౌక ధరల దుకాణాల్లో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు పాత రేషన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. సరఫరా వ్యవస్థలో పొరపాట్లకు తావు లేకుండా, సేవా దృక్పథంతో డీలర్లు పనిచేయాలని మంత్రి నాదెండ్లు సూచించారు.
టాపిక్