నక్సలైట్లతో చర్చలు ఉండవు.. వర్షాకాలంలో కూడా ఆపరేషన్.. సింగిల్ ఆప్షన్ ఇచ్చిన అమిత్ షా

Best Web Hosting Provider In India 2024


నక్సలైట్లతో చర్చలు ఉండవు.. వర్షాకాలంలో కూడా ఆపరేషన్.. సింగిల్ ఆప్షన్ ఇచ్చిన అమిత్ షా

Anand Sai HT Telugu

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని నిర్మూలించాలని మరోసారి చెప్పారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. వర్షాకాలంలో కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.

అమిత్ షా (PTI Photo/Shailendra Bhojak)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలిజాన్ని అంతమొందించాలని పునరుద్ఘాటించారు. నక్సలైట్లతో చర్చలు జరపొద్దని ఆయన ఒక సభలో నిర్మొహమాటంగా చెప్పారు. అదే సమయంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టే గడువులో ఎలాంటి మార్పు లేదన్నారు. వర్షాకాలంలో కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి వర్షాకాలంలో కూడా నక్సలైట్లకు విశ్రాంతి లభించదని, వర్షాకాలంలో కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.

‘వర్షాకాలంలో ప్రతిసారీ నక్సలైట్లకు విశ్రాంతి లభించేది. ఎందుకంటే ఈ సీజన్‌లో దట్టమైన అడవుల్లో ప్రవహించే నదులు నక్సల్స్ వ్యతిరేక చర్యలకు ఆటంకం కలిగించేవి. అయితే ఈసారి వర్షాకాలంలో కూడా వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వం. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగుతాం.’ అని అమిత్ షా అన్నారు.

అమిత్ షా తన ప్రసంగంలో నక్సలైట్లకు ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు. నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి అభివృద్ధి పథంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లతో చర్చలు జరపాల్సిన అవసరం లేదన్నారు. నక్సల్స్ ఆయుధాలు వదిలేసి ప్రధాన స్రవంతిలో చేరాలన్నారు. నక్సల్స్ లొంగిపోవాలని, ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు వదిలి వచ్చేవారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్నారు.

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్రం ఇచ్చిన హామీలను ఎట్టిపరిస్థితుల్లోనూ నెరవేరుస్తామని, వారిని మరింతగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నానని అమిత్ షా చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link