ఇరాన్‌పై అమెరికా దాడి.. అప్పుడు మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పాకిస్థాన్

Best Web Hosting Provider In India 2024


ఇరాన్‌పై అమెరికా దాడి.. అప్పుడు మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పాకిస్థాన్

Anand Sai HT Telugu

ఇరాన్‌కు ఎప్పటి నుంచో మద్దతు ఇస్తామని చెప్పుకొచ్చిన పాక్.. తాజాగా సైలెంట్ అయిపోయింది. అమెరికా దాడితో ఏం అనలేకపోయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్

ొంత కాలం కిందట ఇరాన్‌కు మద్దతిస్తామని పాక్ ప్రకటించింది. ఇస్లామిక్ సౌభ్రాతృత్వం కోసం విజ్ఞప్తి చేసింది. ఇరాన్ పై దాడి జరిగితే ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ అణుదాడి చేస్తుందని కూడా వాదన వినిపించింది. కానీ ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసినప్పుడు పాకిస్థాన్ వెంటనే స్పందించలేదు. చాలా టైమ్ తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆత్మరక్షణ హక్కు ఇరాన్‌కు ఉందని పేర్కొంది.

ట్రంప్-మునీర్‌ల భేటీ ఫలితమే పాక్ ఈ మౌనానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. అప్పటి నుంచి పాకిస్థాన్ ఇరాన్‌కు మద్దతుగా ప్రకటనలు చేయడం మానేసింది. కొంతకాలం క్రితం ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్ పెద్ద పెద్ద మాటలు చెప్పింది. ఈ విషయాలు చెప్పింది మరెవరో కాదు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.

ఇరానీ మా సోదరుడేనని ఆసిఫ్ చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు పూర్తిగా అండగా ఉంటామన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని చెప్పారు. అంతేకాకుండా అన్ని ముస్లిం దేశాల సంఘీభావం గురించి కూడా మాట్లాడారు. ఇజ్రాయెల్ కేవలం ఇరాన్‌నే కాకుండా యెమెన్, పాలస్తీనాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందని ఆసిఫ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం దేశాల ఐక్యత చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అసిమ్ మునీర్ కోసం అమెరికా అధ్యక్షుడు శ్వేతసౌధంలో విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. అనంతరం మునీర్‌తో తాను మాట్లాడిన విషయాలను ట్రంప్ చెప్పారు. జనరల్ మునీర్‌కు ఇరాన్ గురించి బాగా తెలుసని ట్రంప్ అన్నారు. వారితో ఇరాన్ గురించి చర్చించారు. ఒక దేశ సైన్యాధిపతితో ట్రంప్ ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో పాక్ ప్రధాని పాల్గొనకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ పై దాడి చేయడం, పాకిస్తాన్ మౌనంగా కూర్చోవడంతో అందరికీ అర్థమైపోయింది.

ఇరాన్‌కు పాకిస్థాన్ దూరం కావడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఇరాన్‌కు అంత సీరియస్‌గా మద్దతివ్వమని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు పెరగడంతో బలూచిస్థాన్‌లోని ఇరాన్‌తో సరిహద్దును పాకిస్థాన్ మూసివేసింది. చాఘీ, వాషుక్, పంజ్గుర్, కెచ్, గ్వాదర్ జిల్లాల్లోని సరిహద్దు కేంద్రాలను మూసివేసినట్లు బలూచిస్థాన్ ప్రావిన్స్ సీనియర్ అధికారి ఖాదిర్ బక్ష్ పిర్కానీ తెలిపారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link