



Best Web Hosting Provider In India 2024

కూటమి ప్రభుత్వం నేడు కీలక సమావేశం.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో నేడు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది.
అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో నేడు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఎవరెవరు వస్తారు?
ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్వోడీలు (శాఖల అధిపతులు), సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో కలిసి జరుగుతున్న ఈ కార్యక్రమం మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది.
దేనిపై చర్చిస్తారు?
ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, చేసిన మార్పులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని ఈ సమావేశంలో సమీక్షిస్తారు. అలాగే, వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చాలి, అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలి అనే దానిపై ప్రధానంగా చర్చిస్తారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు:
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, పాలనా నష్టాలను సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టే పనిలో ఉంది. తక్కువ కాలంలో సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలతో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం స్వర్ణాంధ్ర @2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా కూటమి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు-పెట్టుబడులను తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం వంటి విషయాల్లో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాదిలో చేసిన సుపరిపాలనను పరిశీలించుకోవడానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్లాన్లను వివరించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తదుపరి ప్రణాళికలు:
ఈ సమావేశంలో ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను చేరుకోవాలి అనే అంశాలపైనా చర్చిస్తారు. గత ఏడాదిలో సాధించిన పురోగతిని వివరిస్తూ, ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం అయ్యాక.. సీఎం, మంత్రులు అందరితో కలిసి అక్కడే భోజనం చేస్తారు.
ప్రమాదం వల్ల వాయిదా: కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా జూన్ 12న ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట అనుకున్నారు. కానీ అహ్మదాబాద్ దగ్గర జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేశారు.
టాపిక్