సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని వీసా దరఖాస్తుదారులకు అమెరికా ఆదేశం

Best Web Hosting Provider In India 2024


సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని వీసా దరఖాస్తుదారులకు అమెరికా ఆదేశం

Anand Sai HT Telugu

వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారందరూ తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో గోప్యతా సెట్టింగ్‌లను పబ్లిక్‌గా సెట్ చేసుకోవాలని అమెరికా కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. గుర్తింపు ధృవీకరణ, పరిశీలనకు ఇది ఉపయోగపడనుంది.

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు మూడు రకాల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కోరింది. ఎఫ్, ఎం, జే (స్టూడెంట్: అకడమిక్, ఒకేషనల్ లేదా ఎక్స్ఛేంజ్ విజిటర్) నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులందరూ తమ గుర్తింపును, అమెరికా చట్టాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌కు సరిపోయే, అవసరమైన పరిశీలనకు వారి అన్ని సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్‌లోలో తెలిపింది.

జాతీయ భద్రత

2019 నుంచి వీసా దరఖాస్తుదారులు ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తు ఫారాలపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే వారితో సహా తమ దేశానికి ఆమోదయోగ్యం కాని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి వీసా స్క్రీనింగ్, తనిఖీలో అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని ఉపయోగిస్తామని రాయబార కార్యాలయం తెలిపింది.

వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత

కొత్త స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ మే 27న అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సోషల్ మీడియా తనిఖీని కఠినతరం చేయాలని అనుకుంటోంది. పలు నివేదికల ప్రకారం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను విస్తృతంగా తనిఖీ చేయడానికి అనుమతించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ గ్యాప్ ఇచ్చింది. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ.. తమ దేశంలోకి రావాలనుకునే వారిని గుర్తించేందుకు అమెరికా ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తుందని చెప్పారు.

వీసాల రద్దు

ట్రంప్ ప్రభుత్వానికి, ప్రముఖ అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మధ్య కొనసాగుతున్న రాజకీయ ఘర్షణ కారణంగా తాజా ఆంక్షలు తలెత్తాయి. ఈ సంస్థలు పక్షపాత వైవిధ్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తాయని, క్యాంపస్‌లో యూదు వ్యతిరేకతను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని ట్రంప్, ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అనేక మంది వ్యక్తులకు విద్యార్థుల వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. వీరిలో చాలా మంది రాజకీయ ప్రదర్శనలలో పాల్గొన్నారు.

భారతీయులపైన ప్రభావం

ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ప్రభావితమయ్యారు. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ పీహెచ్డీ విద్యార్థి బదర్ ఖాన్ సూరిని హమాస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబియా యూనివర్శిటీలో స్కాలర్‌గా ఉన్న రంజని శ్రీనివాసన్ హమాస్‌కు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో వీసాను రద్దు చేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link