‘12 రోజుల యుద్ధానికి ముగింపు’.. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణను ప్రకటించిన ట్రంప్​

Best Web Hosting Provider In India 2024


‘12 రోజుల యుద్ధానికి ముగింపు’.. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణను ప్రకటించిన ట్రంప్​

Sharath Chitturi HT Telugu

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. కాగా, ఈ ప్రకటనకు కొన్ని గంటల ముందే, ఖతార్​లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్​ మిసైల్​ దాడులు చేసింది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (File)

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక థ్రిల్లర్​ సినిమాను తలపిస్తూ సోమవారం అర్థరాత్రి కీలక మలుపులు తిరిగాయి. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో.. ప్రతీకారం తీర్చుకునేందుకు, ఖతార్​లోని అగ్రరాజ్య మిలిటరీ స్థావరాలపై ఇరాన్​ దాడులు చేసింది. వాస్తవానికి ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను అత్యంత ఆందోళనకు గురిచేశాయి. కానీ.. దాడులు ముగిసిన కొద్దిసేపటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన ట్రూత్​ సోషల్​ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలవుతుందని తెలిపారు. ఫలితంగా, 12 రోజుల యుద్ధానికి ముగింపు పడినట్టు వెల్లడించారు.

అమెరికా స్థావరాలపై ఇరాన్​ దాడులు..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ఉపయోగించి.. గత శనివారం అర్థరాత్రి ఇరాన్​లోని 3 కీలక అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). ఆ దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్​.. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఖతార్​లోని అమెరికా మిలిటరీ స్థావరమైన అల్​- అదీద్​ ఎయిర్​ బేస్​పై ఇరాన్​ మిసైల్​ దాడులకు పాల్పడింది. ఈ అల్​- అదీద్​ ఎయిర్​బేస్​ అనేది మధ్యప్రాచ్యంలో అమెరికాకు అతిపెద్ద వ్యూహాత్మక స్థావరం.

“ఇరాన్​ అణు స్థావరాలపై అమెరికా ఎన్ని మిసైళ్లతో దాడి చేసిందో, అన్నే మిసైళ్లతో మేము ఈరోజు దాడులు చేశాము. ఖతార్​లోని పట్టణ, నివాస ప్రాంతాలకు దూరంగా, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండే విధంగా మా టార్గెట్​ని ఎంచుకున్నాము,” అని ఇరాన్​ సుప్రీమ్​ నేషనల్​ సెక్యూరిటీ కౌన్సిల్​ ఒక ప్రకటన చేసింది.

ఈ పరిణామాలతో ప్రపంచం ఉల్లిక్కిపడింది. ఖతార్, ఇరాక్​, యూఏఈ, బహ్రైన్​, కువైట్​లు​ తన గగనతలాన్ని మూసివేశాయి. అనేక దేశాలు ఖతార్​కు విమాన సేవలను నిలిపివేశాయి. మధ్యప్రాచ్యంలోని భారతీయులు సహనంతో, జాగ్రత్తగా ఉండాలని భారత్​ సూచించింది.

అయితే ఇరాన్​ దాడులు జరిగిన కొన్ని గంటలకు.. ఈ పూర్తి వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. తమ మిలిటరీ స్థావరాలపై దాడులు చేయబోతున్నట్టు ఇరాన్​ తమకు ముందే చెప్పిందని, తద్వారా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

“ఒక్క అమెరికా పౌరుడికి కూడా హానీ జరగలేదని చెప్పేందుకు నాకు సంతోషంగా ఉంది. అసలు మనకి డ్యామేజ్​ కూడా జరగలేదు. ఇక భవిష్యత్తులో ఎలాంటి ధ్వేషం ఉండదని భావిస్తున్నాను. ఇక ఇరాన్​ ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతి కోసం అడుగులు వేయొచ్చు. ఇజ్రాయెల్​ కూడా అదే పని చేయాలని నేను ప్రోత్సహిస్తాను. ప్రపంచానికి నా శుభాకాంక్షలు. ఇది శాంతి సమయం,” అని ట్రంప్​ అన్నారు.

ఇజ్రాయెల్​- ఇరాన్​ కాల్పుల విరమణ!

అనంతరం.. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఈ మేరకు.. 12 రోజుల యుద్దం అధికారికంగా ముగిసిందని ఆయన తన ట్రూత్​ సోషల్​ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

“అందరికి శుభాకాంక్షలు. ఇజ్రాయెల్​- ఇరాన్​ దేశాలు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి. (ఇప్పటి నుంచి ఆరు గంటల్లో కాల్పుల విరమణ ఉంటుంది. ఈలోపు ఇరు వర్గాలు మొదలుపెట్టిన ఫైనల్​ మిషన్స్​ని పూర్తి చేసుకుంటాయి). 24 గంటల్లోపు దశలవారీగా కాల్పుల విరమణ అమలవుతుంది. ఆ తర్వాత యుద్ధం పూర్తిగా ముగిసిపోయిందని మనం అనుకోవచ్చు,” అని ట్రంప్​ అన్నారు.

కాగా ట్రంప్​ కాల్పుల విరమణ ప్రకటనపై ఇజ్రాయెల్​, ఇరాన్​లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

“యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేది. మధ్యప్రాచ్యాన్ని పూర్తిగా నాశనం చేసేది. కానీ అలా జరగలేదు. అలా జరగదు,” అని ట్రంప్​ చెప్పుకొచ్చారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link