జులై 1 నుంచి రైలు ఛార్జీలు పెరిగే ఛాన్స్.. ఏ తరగతికి ఎంత పెంచుతారంటే?

Best Web Hosting Provider In India 2024


జులై 1 నుంచి రైలు ఛార్జీలు పెరిగే ఛాన్స్.. ఏ తరగతికి ఎంత పెంచుతారంటే?

Anand Sai HT Telugu

భారతీయ రైల్వే ఛార్జీలు జులై 1 నుంచి పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు అంతా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్లాస్ ప్రయాణం ఎంత ఖరీదైనది తెలుసుకుందాం..

జులై 1 నుంచి రైల్వే ఛార్జీల పెంపు

జులై 1 నుంచి రైలు ప్రయాణం కొంచెం ఖరీదైనది కానుందని తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో ఛార్జీలను పెంచబోతోంది. ఏసీ, స్లీపర్, సెకండ్ (జనరల్) తరగతులకు ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని సమాచారం. అయితే లోకల్ రైళ్లు, నెలవారీ సీజన్ టికెట్ హోల్డర్లకు ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. 2025 జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఛార్జీలు ఎంత పెరుగుతాయి?

ఏసీ క్లాస్ కు కిలోమీటరుకు 2 పైసలు, స్లీపర్ క్లాస్ కు కిలోమీటర్ కు 1 పైసలు, జనరల్ క్లాస్ కు కిలోమీటరుకు 0.5 పైసలు (500 కిలోమీటర్లు దాటితే) ఛార్జీలు ఉంటాయి. దీనివల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.920 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో 2025-26లో మొత్తం ప్రయాణికుల ఆదాయం రూ.92,800 కోట్లకు చేరుకుంటుందని రైల్వే గణాంకాలు చెబుతున్నాయి.

గతంలో ఆదాయం

2024-25 సంవత్సరంలో 736 కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. దీని వల్ల రైల్వేకు రూ.75,215 కోట్ల ఆదాయం సమకూరింది. రైల్వే మొత్తం ఆదాయంలో 65 శాతం సరుకు రవాణా, 30 శాతం ప్యాసింజర్ విభాగం, మిగిలినది ఇతర వనరుల నుంచి వస్తుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్, త్రీ టైర్, ఛైర్ కార్ వంటి ప్రీమియం ఏసీ క్లాసులు మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 54 శాతం వాటాను అందిస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది. దీనికి భిన్నంగా స్లీపర్, జనరల్ క్లాస్ కలిపి 37 శాతం మంది ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. లోకల్ రైళ్లలో మొత్తం ప్రయాణికుల్లో 57 శాతం మంది ప్రయాణిస్తున్నారు.

చివరిసారిగా

చివరిసారిగా 2020 జనవరిలో రైల్వే శాఖ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. అప్పట్లో నాన్ ఏసీ మెయిల్/ఎక్స్ప్రెస్ (స్లీపర్ క్లాస్) ఛార్జీలను కిలోమీటరుకు 2 పైసలు, ఏసీ క్లాస్ ఛార్జీలను కిలోమీటరుకు 4 పైసలు పెంచారు. 80 కిలోమీటర్ల వరకు లోకల్ ట్రావెల్, సీజన్ టికెట్ల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం రైల్వే తన ప్రయాణికుల సేవలకు భారీగా సబ్సిడీ ఇస్తుంది. సబర్బన్ సర్వీసులు కేవలం 30 శాతం మాత్రమే వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ ట్రావెల్ 39 శాతం, ఏసీ ట్రావెల్స్ 3.5 శాతం మాత్రమే లాభాలను అందిస్తున్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link