




Best Web Hosting Provider In India 2024

‘వారంలో కనీసం 2 సర్కార్ బడులకు వెళ్లండి ‘ – అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు
ఉన్నత ప్రమాణాలతో తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన… అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు.
బడులను సందర్శించండి – సీఎం రేవంత్
విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 48 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అందుకు అనుగుణంగా పాఠశాలల్లో వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలన్నారు. అందుకు సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని చెప్పారు.
పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వీటి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చన్నారు. తద్వారా వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రణాళికలు రూపొందించడి:
పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు.
నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించారు. కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలనిసూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలను తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా నగరంలో పారిశుధ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
టాపిక్