




Best Web Hosting Provider In India 2024

జాతీయ పార్టీల పతనం.. ఏపీ ప్రజలకు శాపం
‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ పార్టీల బలహీన స్థితి, ప్రాంతీయ శక్తుల్ని బలోపేతం చేయడమే కాకుండా కుల రాజకీయాలకు దోహదమవుతోంది. పలు వికారాలకు ఇదొక ముఖ్య కారణంగా నిలుస్తోంది..’ – పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఆర్.దిలీప్ రెడ్డి విశ్లేషణ.
ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. జనానికొక ప్రత్యామ్నాయ అవకాశంగా జాతీయ పార్టీలు బలపడే సూచనలేవీ కనిపించడం లేదు.
రాష్ట్రంలో ఎదుగుదలకు అవకాశం ఉండీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా ఉనికి కోల్పోయే స్థితిలోకి జారుతున్నాయి. 2024 ఎన్నికలు ముగిసి ఏడాదయినా… ఏపీలో ఏ జాతీయ పార్టీ పుంజుకోవటం లేదు. పైగా మరింత బలహీనపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా ఆయా పార్టీల జాతీయ నాయకత్వపు ఉదాసీన వైఖరే కారణంగా కనిపిస్తోంది.
నామమాత్రపు ఉనికి
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీలు పేరుకే జాతీయ పార్టీలు తప్ప జనంలో నామమాత్రపు ఉనికితో ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి కూడా నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. సొంతంగా ఈ పార్టీలేవీ ఒక సీటు గెలువలేని స్థితిలో ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ శక్తుల మధ్యే పోటీ!
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చెరొక పర్యాయం రాష్ట్రాన్ని పాలించాయి. ఇదివరలో బీజేపీని కలుపుకొని తెలుగుదేశం సర్కారు (2014-19) ను నడిపింది. వైఎస్సార్సీపీ అయిదేళ్ల (2019-24) పాలన తర్వాత ఇప్పుడు బీజేపీని కలుపుకొని తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కూటమి సర్కార్లున్న అప్పుడైనా, ఇప్పుడైనా పెత్తనమంతా టీడీపీదే! రాజకీయ విధానాలు, ఆలోచనలు కూడా వారివే అమలవుతున్నాయని సగటు ప్రజలు భావిస్తున్నారు.
మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నా, ఉనికి సున్నా! మొన్నటిదాకా అధికారంలో ఉన్న వైకాపానే ప్రజలు ప్రతిపక్షంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో అధికార కూటమికి 164 స్థానాలుంటే మిగిలిన పదకొండు స్థానాలూ వైకాపాకే ఉన్నాయి. ఇక బీజేపీతో రాష్ట్రంలోని దాదాపు అన్ని పార్టీలూ ఏదో ఒక సందర్భంలో విబేధించినవే! కానీ, కాలక్రమంలో ఈ ప్రాంతీయ శక్తులన్నీనేరుగానో, పరోక్షంగానో బీజేపీతో రాజీపడినవే!
2014 లో బీజేపీతో ఉన్న తెలుగుదేశం పార్టీ 2018 నాటికి తీవ్రంగా విబేధించింది. గతమంతా మరచి, చంద్రబాబునాయుడు ఏకంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీ ఇంటికి వెళ్లి భేటీ అవడమే కాకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ అది మరచి 2024 నాటికి బీజేపీతో కూటమి కట్టారు. వైఎస్సార్సీపీకి బీజేపీతో ఎప్పుడూ పొత్తు లేకపోయినా, అధికారంలోకి వచ్చిన 2019 తర్వాత కూడా బీజేపీని గట్టిగా విబేధించింది లేదు. కేంద్రంలో బిల్లుల విషయం కానీ, ముఖ్య విధానాల్లోనైనా, దాదాపు అన్ని సందర్భాల్లోనూ మద్దతుగానే ఉన్నారు.
2019-24 కాలంలో మూడు పార్టీలదీ బీజేపీతో సానుకూల దోరణే! 2024 ఎన్నికల ముందు నాటికి ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీ మధ్య సఖ్యత ఎలా తయారయిందంటే, బీజేపీ అంటే… బి-బాబు, జె-జగన్, పి-పవన్ అని వేదికలపై వేళాకోళమాడిన పరిస్థితి! అయినా క్షేత్రంలో వాళ్లే బలవంతులు, బీజేపీ నిల్!
శిబిరం మారిన కాంగ్రెస్ శ్రేణులు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరణ ద్వారా శిక్షించారు. అందుకే, మూడు పర్యాయాలు, ఆరు ఎన్నికల్లో ఒకటంటే, ఒక స్థానం కూడా వారికివ్వలేదు. ఎక్కడా పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. ప్రజల వైపు నుంచి వైఖరి ఇలా ఉంటే, పార్టీ పరంగా కూడా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన ప్రత్యేక శ్రద్ద ఏమీ లేదు. రెండు ఎన్నికల్లో నేతృత్వం వహించిన మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని, తదనంతరం వచ్చిన గిడుగు రుద్రరాజును కాదని వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్ షర్మిలకు పీసీసీ కిరీటం పెట్టినా… ఒరిగిందేమీ లేదు.
సోదరుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పట్ల ఉన్న వైరం కొద్దీ వ్యక్తిగత ఎజెండా ప్రచారానికి పార్టీ వేదికను వాడుకోవడమే తప్ప పార్టీకి ఆమె పెద్దగా సానుకూలత పెంచిందేమీ లేదన్నది జనాభిప్రాయం.
నిజానికి 2014 వరకు కాంగ్రెస్తో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణి, సానుభూతిపరులే క్రమంగా జగన్ పక్కన చేరారు. ఆయనకు దన్నుగా నిలిచారు. అందుకే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయినా, విజేత టీడీపీకి, వైకాపాకు మధ్య ఓట్ల వ్యత్యాసం 2 శాతం లోపే! కాంగ్రెస్ శ్రేణులు వైకాపాలో చేరడం మమేకం కావడం వల్లే రాష్ట్రంలో ఓడినపుడు కూడా 40 శాతానికి తగ్గని ఓట్లు వైకాపాకు లభిస్తున్నాయి.
రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఉండే తటస్థులు 2014లో, 2024లో బాబుకు మద్దతిస్తే 2019లో పెద్ద ఎత్తున జగన్కు మద్దతివ్వడం వల్లే ఫలితాలు వైవిధ్యంగా వస్తున్నాయి.
బాబును, టీడీపీని సహజంగా వ్యతిరేకించే కాంగ్రెస్ శ్రేణులకు జగన్ నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. అన్నం ఉడికిందీ, లేనిది ఒక మెతుకు చూస్తే తెలిసినట్టు, ఒక్క నందిగామ ఉప ఎన్నిక రాజకీయ చిత్రం మనకి ఈ మొత్తాన్ని పట్టిస్తుంది. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన నందిగామ టీడీపీ అభ్యర్థి, ప్రమాణస్వీకారానికి ముందే మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. వైకాపా పోటీ చేయని ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి 20 శాతం ఓట్లు లభించాయి. సాధారణ ఎన్నికల్లో 1.28 ఓట్లు మాత్రమే పొందిన కాంగ్రెస్కు ఉప ఎన్నికల్లో అంత శాతం వచ్చాయంటే, టీడీపీని ఇష్టపడని కాంగ్రెస్ వాదులంతా వైకాపాలో సర్దుకున్నారనడానికి ఇదే సాక్ష్యం.
జనం వాతకు తోడు సొంత పైత్యం కొంత
విభజన జరిగి దశాబ్ద కాలం అయినందున ఏపీలో కాంగ్రెస్ ఇంకొంత వ్యూహాత్మకంగా నడచుకునే అవకాశం ఉండింది. వైకాపా నాయకత్వం తీరు నచ్చని కాంగ్రెస్ వారిని తిరిగి వెనక్కి తెచ్చుకునే ఒక మంచి ప్రయోగంగా షర్మిలకు పీసీసీ పగ్గాలివ్వటాన్ని రాజకీయ పండితులు ప్రశంసించారు.
కానీ, 2024 ఎన్నికల్లో ఈ దిశలో జరిగిందేమీ లేదు, అంతకు ముందరి ఎన్నికలో పోల్చి చూస్తే 0.55 శాతం ఓట్లు మాత్రమే పెంచుకొని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 1.72 శాతం ఓటు వాటాను పొందింది. ఒక్క సీటూ రాలేదు, డిపాజిట్లూ దక్కక ప్రయోగం విఫలమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజమైన వారసురాలు షర్మిల అని, ఆయన సతీమణి వై.ఎస్.విజయమ్మ ప్రచారం చేసి, స్వయంగా షర్మిల పోటీ చేసిన కడప లోక్సభ స్థానంలో 10 శాతం ఓట్లే తప్ప డిపాజిట్ కూడా ఆమెకు దక్కలేదు.
జగన్ను విమర్శించే వ్యక్తిగత ఎజెండా తప్ప పార్టీ విధానాలకో, ప్రజల అవసరాలకో ఆమె పెద్దపీట వేయడం లేదని సగటు ప్రజలు గ్రహించిన సందర్భం. ఈ వైఖరి 2024 ఎన్నికలకు ముందే బయటపడినా… పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు విపక్షంలో ఉండి కూడా పాలకపక్ష కూటమిపైన కన్నా, విపక్షంలో ఉన్న వై.ఎస్ జగన్నే లక్ష్యం చేసుకొని విమర్శలు గుప్పించడాన్ని జనం ఆదరించడం లేదు.
పైగా, ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా కూటమి శక్తుల చేతిలో షర్మిల ఉపకరణంగా మారినట్టుందని సగటు కాంగ్రెస్ కార్యకర్త కూడా భావించే పరిస్థితి. పేరున్న పెద్ద నాయకుల సేవల్ని సమర్థంగా వినియోగించుకోవడం సంగతలా ఉంచి కనీసం వారిని ఖాతరు చేయకపోవడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. విలేకరుల సమావేశం పెట్టినా… రెండంశాలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే, నాలుగు అంశాలు జగన్ను విమర్శించేవే ఉండటాన్ని తప్పుబడుతున్నారు. ఇది సరైన పంథా కాదని పార్టీ నాయకత్వం ఏనాడూ ఆమెను, ఆమె ప్రాధాన్యతలను ప్రశ్నించింది లేదు, నిలువరించిందీ లేదు. ఏపీలో కాంగ్రెస్ ఏ కోశానా పుంజుకోవటం లేదు. పుంజుకునే సంకేతాలూ లేవు.
కాల గర్భంలోకి కమ్యూనిస్టులు
తెలుగునాట కాంగ్రెస్ లాగే ఒకప్పుడు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇపుడు మినుకు మినుకుమనే గుడ్డి దీపాల్లా తయారయాయి. దశాబ్దాల పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయి. 1983లో తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్కు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయంగా ఉండేది. విద్యార్థి, మహిళా, యువ, కార్మిక వంటి పార్టీ అనుబంధ విభాగాలు ఎంతో క్రియాశీలంగా ఉండి, నాయకత్వ ఉత్పత్తి కేంద్రాలుగా పనిచేసేవి. ఇప్పుడవన్నీ బలహీనపడి ట్విట్టర్, సోషల్ మీడియా, సంప్రదాయ మీడియాలో ప్రకటనలకు పార్టీలు పరిమితమయ్యాయి.
2024 ఎన్నికల్లో సీపీఎం 0.13 శాతం ఓటు వాటా పొందితే, సీపీఐ కి దక్కిన వాటా 0.04 శాతమే! పాలకపక్షాలతో సమయానుకూల పొత్తుల్లో నికరంగా వారు బాపుకున్నది లేకపోగా సంస్థాగతంగా ఎంతగానో నష్టపోయారు. కోలుకొని, తిరిగి గాడినపడే సూచనలేవీ కనబడటం లేదు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఒక్క సీటూ గెలువలేకపోయారు. ఇదివరకటిలా ప్రజా సమస్యల్ని వారూ పెద్దగా పట్టించుకోనట్టే, ప్రజలూ వారిని లెక్కచేయట్లేదనడానికి ఎక్కడా వారి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడమే నిదర్శనం.
ఏవో కొన్ని అంశాల్లో తప్ప, ఇదివరకటిలా కమ్యూనిస్టు పార్టీల ఐక్యపోరాటాలూ లేవు. పౌర సమస్యలకు సంబంధించి ఫలానా అంశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమించారని చెప్పడానికి దశాబ్ద కాలంలో ఏమీ లేదు. పైగా, పార్టీ నాయకులు కొందరు ఏవో ప్రధాన పాలకవర్గాల పట్ల లోపాయికారి సానుభూతిపరులుగా ఉంటారనే విమర్శలున్నాయి. స్థూలంగా సీపీఐ టీడీపీకి ఒకింత అనుకూల దోరణితో ఉంటే సీపీఎం ఆయా నాయకత్వాల్లో వైకాపాకు పరోక్ష దన్నుగా ఉందని మీడియా వర్గాలు భావిస్తాయి. కుల, వర్గ పక్షపాతాలకూ కొదువలేదు. కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నాయకుల్లో కొందరు బాబే నయమంటే కాదు జగనే నయమని మరికొందరు ప్రయివేటు సంభాషణల్లో నిర్మొహమాటంగా మద్దతు మాటలు చెబుతుంటారు. ఇక, వీరేం ఉద్యమాలు చేస్తారనే భావనను సగటు కార్యకర్త వ్యక్తం చేస్తుంటాడు.
కాషాయానికో ఆశయముందా?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎదగాలని, సంస్థాగతంగా బలపడాలని బీజేపీకి ఉందా? అనే సందేహం రాజకీయవర్గాల్లో తరచూ వ్యక్తమౌతోంది. ఏపీ విషయాల్లో పార్టీ అధినాయకత్వం అనుసరించే వైఖరి కూడా అలాగే ఉంటోంది. తాత్కాలిక ప్రాతిపదికన రాజకీయంగా లబ్ది పొందినపుడు సరే, దీర్ఘకాలిక వ్యూహమే కొరవడిరది. మొన్నటికి మొన్న 2024 ఎన్నికలప్పుడు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగానే అడుగులు వేసి టీడీపీ-జనసేన ద్వయంతో పొత్తు కుదుర్చుకుంది. అది స్థూలంగా ఎన్డీయేకు ఎంతో లాభించింది.
25 లోక్సభ స్థానాల్లో వైకాపా గెలిచిన 3 స్థానాలు తప్ప 22 స్థానాలు ఎన్డీయే ఖాతాలోకి వచ్చేలా చేసిన ఎత్తుగడ ఫలించింది. పనిలో పనిగా 3 లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలు పార్టీ ఖాతాలోకి వచ్చి పడ్డాయి. కానీ, అది నిలకడైన పార్టీ బలం కాదు. పొత్తులు-పరిమిత పోటీల వల్ల ఏపీలో పార్టీ ఓటు వాటాను 0.83 శాతం (2019) నుంచి 2.83 శాతానికి బీజేపీ పెంచుకోగలిగింది. దీన్ని రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలంగా పరిగణించడానికి లేదు.
ఎందుకంటే, ఆయా నియోజకవర్గాల్లో కూటమి ఇతరులైన టీడీపీ, జనసేన అభ్యర్థులు లేకపోవడం వల్ల ఆ మాత్రం ఓట్లు లభించాయి. హిందుత్వ ఏపీలో బలమైన మనోభావాల అంశంగా లేదు. ఉన్నపాటి సానుభూతిని కూడా, ‘సనాతన ధర్మ’ జెండాను భుజాలకెత్తుకొని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైజాక్ చేశారు. కమ్యూనిస్టుల లానే బీజేపీలో కూడా కులాల, వర్గాల ప్రాతిపధికన తెలుగుదేశం అనుకూల, ప్రతికూల నాయక శ్రేణి పార్టీలో ఉంటుంది. చంద్రబాబు అంటే పడని కొందరు బీజేపీ నేతలు నాయకత్వ స్థానాల్లో ఉన్నపుడు వై.ఎస్.జగన్ అనుకూల ధోరణి, బాబు అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలున్న నాయకులు నేతృత్వ స్థానాల్లో ఉన్నపుడు సహజంగానే టీడీపీ అనుకూల వైఖరి విస్పష్టంగా కనిపిస్తుంది.
ఈ పరిణామాలన్నీ అంతిమంగా పార్టీ సుస్థిర ఎదుగుదలకు అవరోధాలే! టీడీపీ రాజకీయంగా బీజేపీకి ఒకసారి మిత్రునిగా, మరోసారి శత్రువుగా ఉంటుండే పరిస్థితుల్లో…. పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే ‘కోవర్టుల’ బీజేపీలో తీవ్రంగానే ఉంది. జాతీయ పార్టీలు బలహీనంగా ఉండి, అవి ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రకాలు కాకపోవడంతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యమే ఏపీలో బలంగా ఉంది. ఫలితంగా కుల, వర్గ ఆధిపత్య రాజకీయాలు నిరాఘాటంగా సాగుతున్నాయి. ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ప్రజల్ని తమవైపు ఆకట్టుకునే చర్యలు ఏ జాతీయ పార్టీ చేపట్టడం లేదు.
– దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ
(Disclaimer: ఈ రాజకీయ విశ్లేషణలో తెలియపరిచిన అభిప్రాయాలు, వ్యూహాలు, విశ్లేషణలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్వి కావు)
టాపిక్