



Best Web Hosting Provider In India 2024

ఈ చెరువు నీళ్లు తాగితే ఇక అంతే సంగతి…! నగరవాసులకు ‘హైడ్రా’ హెచ్చరికలు, రిపోర్ట్ లో కీలక విషయాలు
హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులోని నీరు వాడొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నీటిలో సీసం, కాడ్మియం లెవెల్స్ అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని… ఇకపై ఆ నీటి వాడకంపై నిషేధం విధించింది.
హైదరాబాద్ లోని మాధాపూర్ సున్నం చెరువులోని నీటి వాడకంపై హైడ్రా హెచ్చరికలను జారీ చేసింది. కొందరు వ్యాపారులు… చెరువు చెంత బోర్లు వేసి… ప్రజల ఆరోగ్యానికి కన్నం పెడుతున్నారని తేల్చింది. కలుషిత జలాలతో మాధాపూర్ పరిసరాల్లో ఉన్న హాస్టల్స్ విద్యార్థుల భవిష్యత్ ను అనారోగ్యం పాలు చేస్తున్నట్లు గుర్తించింది.
పీసీబీ ద్వారా పరీక్షలు…
ఈ చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా అధికారులు.. ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ద్వారా పరీక్షించింది. తాగునీటిగా సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది.
సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా.. రెండింతలు, మూడింతలు, 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని పీసీబీ పరిశోధనల్లో వెల్లడైంది.
మోతాదులకు మించి లోహాలు…
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం (Lead -Pb) వరకూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 – 0.122 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఫర్వాలేదు అనుకునే స్థాయిలో 7 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. దీంతో పిల్లల మెదడు చురుకుతనంపై ప్రభావం చూపుతోంది. జ్ఞాపిక శక్తిని తగ్గిస్తుంది. రక్తహీనతకు కారణమవవ్వడమే కాకుండా.. బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైనా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.
కాడ్మియం 0.003 వరకూ ఉన్న ఫర్వాలేదు అని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే సున్నం చెరువు పరిసరాల్లోని బోరు వాటర్లో 0.007 – 0.010 ఉన్నట్టు వెల్లడైంది. 2 – 3 రెట్లు అధికం ఉంది. అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. మూత్రం ద్వారా ప్రొటీన్లు పోవడంతో ఎముకుల బలహీనతకు దారి తీస్తుంది. క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం…. ఒక లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉంటే ఫర్వాలేదు. కానీ సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో 0.038 – 0.046 అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. అంటే 2 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. మనం తాగే నీటిలో నికెల్ ఎక్కువ ఉంటే.. చర్మ సంబంధిత వ్యాధులతో పాటు.. కాలేయం దెబ్బతింటోంది. తద్వారా మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక ఒత్తిడికి గురై చిన్న వయసులోనే రక్తపోటుకు కూడా కారణమౌతుందని వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు సున్నం చెరువు చెంత బోరు నీటిని తాగునీటి అవసరాలకు అమ్ముతున్నవారిపై పోలీసు కేసులను కూడా హైడ్రా నమోదు చేయించింది. ఈ ఏరియాలో ఉండే వాళ్లు… నీటి వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నగరంలో చేపడుతున్న 6 చెరువుల (మాధాపూర్లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్లోని నల్లచెరువు, అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్ నుద్దౌలా చెరువు) పునరుద్ధరణలో సున్నం చెరువు ఉంది. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి.. మంచి నీరు నిలిచేలా దాదాపు రూ. 10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
టాపిక్