




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సస్సెన్స్ థ్రిల్లర్.. 8.4 ఐఎండీబీ రేటింగ్.. భార్య హత్య కేసులో భర్త.. ఇక్కడ చూసేయండి
థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ అదరగొడుతోంది. ఈ సీట్ ఎడ్జ్ మూవీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ పంచుతుంది. ఈ మూవీ ఏదీ? ఏ ఓటీటీలో ఉందనే వివరాలు ఇక్కడ చూసేయండి.
థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. ఈ మూవీ రీసెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సత్తాచాటుతోంది. ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8.4గా ఉంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.
ఏ ఓటీటీలో అంటే?
థియేటర్లలో చక్కటి విజయాన్ని అందుకున్న ‘ఒక పథకం ప్రకారం’ సినిమా జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’.
వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది.
భార్య హత్య కేసులో
‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో సాయిరామ్ శంకర్ చక్కటి కమ్ బ్యాక్ ఇచ్చారని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ‘ఒక పథకం ప్రకారం’లో సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల కు కారణం అతనే అంటూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. భార్య హత్య కేసులోనూ హీరో చిక్కుకుంటాడు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమా.
రూ.10 వేలు
ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తామని ఒక పథకం ప్రకారం సినిమా థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా యూనిట్ చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. థియేటర్కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
సంతోషంగా ఉంది
నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ మాట్లాడుతూ… ”మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణకు చాలా థాంక్స్. ఈ సినిమా దర్శక నిర్మాణంలో నాకు అండగా నిలబడిన మా హీరో సాయిరామ్ శంకర్ తో పాటు చిత్ర బృందం అందరికీ థాంక్స్” అని చెప్పారు.
శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులు ఈ సినిమాలో నటించారు.
సంబంధిత కథనం