క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటం కంప్యూటర్‌ను ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆసక్తిగా పరిశీలించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో) (PTI)

విజయవాడలో జరిగిన ‘క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్‌షాప్‌’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు, టెక్నాలజీ రంగానికి ఎంతో కీలకమైన అడుగని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్టార్టప్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం, క్వాంటం కంప్యూటర్‌ పరిశీలన

క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటం కంప్యూటర్‌ను ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆసక్తిగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా క్వాంటం టెక్నాలజీపై ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఈ వర్క్‌షాప్‌కు ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, టీసీఎస్ ప్రెసిడెంట్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

భారత్ కు క్వాంటం టెక్నాలజీ అడ్వాంటేజ్ దక్కుతుంది – ఐబీఎం

క్వాంటం వ్యాలీ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం పట్ల ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమయంలో క్వాంటం టెక్నాలజీపై ముందడుగు వేయడం స్వాగతించదగిన విషయమన్నారు. “క్వాంటం టెక్నాలజీ అడ్వాంటేజ్‌ను భారత్ సొంతం చేసుకుంటుంది. దాన్ని ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి వినియోగిస్తుందని పూర్తి విశ్వాసం ఉంది” అని ఆయన అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం టెక్నాలజీ పార్కు విస్తృతమైన పరిశోధనకు ఉపయోగపడుతుందని, డీప్ టెక్‌లో మరింత పరిశోధన జరగాలని ఆయన సూచించారు.

ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ మాట్లాడుతూ, 2021 నుంచి 2,00,000 మంది క్వాంటం సాంకేతికతను ఐబీఎం నుంచి తెలుసుకున్నారని, 25,000 మంది విద్యార్థులు దీన్ని నేర్చుకున్నారని చెప్పారు. “వివిధ రంగాల్లో ఆల్గారిథమ్స్ రాసే సాంకేతిక నిపుణుల్ని రూపొందిస్తున్నాం. ఎల్టీఐ మైండ్‌ట్రీ కూడా ప్రపంచవ్యాప్తంగా క్వాంటం టెక్నాలజీలో మాతో కలిసి పనిచేస్తోంది. అత్యాధునిక క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాం” అని ఆయన ప్రకటించారు. ప్రపంచానికి, భారత్‌కు ఉన్న వివిధ సవాళ్లను భారత్ నుంచే పరిష్కరించేలా క్వాంటం సాంకేతికతను విస్తృత పరుస్తామని, అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటం కంప్యూటర్ నమూనాను ప్రదర్శనకు ఉంచామని క్రౌడర్ తెలిపారు. 2029లో స్టార్లింగ్ అనే క్వాంటం కంప్యూటర్‌ను ఐబీఎం ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోందని, ఇది మరింత క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేలా రూపొందిస్తున్నామని వివరించారు.

అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి ఆస్తి – టీసీఎస్, ఎల్ అండ్ టీ

అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయడంలో తాము కూడా భాగస్వామ్యం కావటం సంతోషదాయకమని టీసీఎస్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న అన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసి, ఒక పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టం) వచ్చేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు ఒక కీలకమైన ముందడుగు అని, పరిశోధకులకు, సంస్థలకు, ప్రభుత్వాలకు ఇది ఒక మంచి కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి మంచి ఆస్తి అవుతుందని, క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించటంలో క్వాంటం కంప్యూటింగ్ సమాధానం అవుతుందని అన్నారు. సంప్రదాయ కంప్యూటర్లతో సాధ్యం కానిది క్వాంటం సాంకేతికతతో సాధ్యమని, డ్రగ్ డిస్కవరీ లాంటి కీలకమైన అంశాలపై టీసీఎస్ పనిచేస్తోందని రాజన్న తెలిపారు.

మెకిన్సీ అంచనాల ప్రకారం వంద బిలియన్ డాలర్ల వరకూ క్వాంటం కంప్యూటింగ్ మార్కెట్ ఉంటుందని, రాబోయే డిజిటల్ విప్లవం క్వాంటం టెక్నాలజీతోనేనని ఎల్ అండ్ టీ అడ్వైజర్ సతీష్ అన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేశామని, ఎల్టీఐ మైండ్‌ట్రీ ద్వారా క్వాంటం రంగంలో ఎల్ అండ్ టీ పనిచేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఐటీలో హైదరాబాద్, ఇప్పుడు క్వాంటం వ్యాలీకి అమరావతి అడ్రెస్ అవుతాయని సతీష్ జోస్యం చెప్పారు. స్టేట్ డాటా లేక్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఎన్టీఆర్ భరోసా వంటి పాలనా సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు క్వాంటం సాంకేతికత ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

టాపిక్

Chandrababu NaiduGovernment Of Andhra PradeshInformation Technology
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024