



Best Web Hosting Provider In India 2024
అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ) అయింది.
వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు ఉండనున్నాయి. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్ , 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. భద్రమైన నెట్వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి ప్రభుత్వం అందించనుంది.
చదరపు అడుగుకు రూ.30కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ ను ప్రభుత్వానికి ఐబీఎం సంస్థ కేటాయించనుంది.
ప్రభుత్వ సంస్థలు, విద్య పరమైన అంశాలకు ఈ కంప్యూటింగ్ టైమ్ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విట్ యూనివర్సిటీ క్యాంపస్లో రూ.6 కోట్ల వ్యయంతో మరో చిన్న క్వాంటం కంప్యూటర్ను బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ క్యూపై ఏఐ ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీనికి ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న ఎల్ అండ్ టీతో ఒప్పందాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులోకి ఐబీఎం కూడా అడుగుపెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబీఎం తన క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
టాపిక్