



Best Web Hosting Provider In India 2024

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – 7 రోజుల పాటు ఈ టికెట్లు రద్దు..!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. అలిపిరిలో ఇచ్చే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లను 7 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది,
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను 7 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రాంతంలో అడ్డుగా ఉన్న చెట్లు తొలగింపు, నవనీకరణ తదితర కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తేదీలివే…
సెప్టెంబర్ 07వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. సదరు 7 రోజుల్లో దివ్యానుగ్రహ విశేష హోమంను మరోచోట ఏకాంతంగా నిర్వహించనుండడంతో ఆన్ లైన్ టికెట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ నెలలో 7 రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఆన్ లైన్ లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వివరించింది. సదరు 7 రోజుల పాటు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
మోసగిస్తే కఠిన చర్యలు – టీటీడీ
తిరుమల వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించింది. అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని తప్పుడు సమాచారంతో పరిచయం చేసుకున్నాడు. సదరు భక్తురాలికి వసతి కల్పిస్తామని నమ్మబలికి కొంత మొత్తాన్ని వసూలు చేశాడు. డబ్బు చెల్లిస్తే వసతి టికెట్ ను పిడిఎఫ్ పంపిస్తామని హామీ ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత సదరు నిందితుడు తన ఫోన్ కాల్స్ , వాట్సాప్ మేసేజ్ లకు స్పందించకుండా మోసం చేశాడు. దీంతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసపోయానని గ్రహించిన సదరు భక్తురాలు 1930 క్రైమ్ హెల్ప్ లైన్ కు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల టీటీడీ సేవల పేరుతో నకిలీ వెబ్ సైట్లు ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. భక్తులను అనుమాస్పద వ్యక్తులు, దళారులు ప్రలోభ పెడితే ముందుగా టిటిడి విజిలెన్స్ విభాగానికి చెందిన నెంబర్ కు 0877 – 2263828 ఫోన్ చేసి అనుమానాలను భక్తులు నివృత్తి చేసుకోవాలని సూచించింది.
శ్రీవారి దర్శనం, వసతి కోసం టీటీడీ అధికారిక వెబ్సై ట్ https://ttdevasthanams.ap.gov.in లేదా ttdevasthanams mobile app ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డ్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని భక్తులకు సూచించింది. ఇతర వివరాలకు టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు ఫోన్ చేసి వివరాలు కోరింది.
సంబంధిత కథనం
టాపిక్