




Best Web Hosting Provider In India 2024

చీరాల వాడరేవులో విషాదం.. సముద్రంలో ఐదుగురు గల్లంతు.. తెలంగాణలో ఇద్దరు!
బాపట్ల జిల్లా వాడరేవులో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతు అయ్యారు. తెలంగాణలో మరో ఘటనలో ఇద్దరు గల్లంతు అయ్యారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం రోజున సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లి.. ఐదుగురు గల్లంతు అయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆదివారం సెలవు దినం కావడంతో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు వాడరేవు తీరానికి వచ్చారు. ఈ బృందంలోని సాయి మణిదీప్, జీవన్ సాత్విక్, సాకేత్ సముద్రంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోపలికి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువై కొట్టుకుని పోయారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత ఈ ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.
ఇక మరో విద్యార్థి సోమేశ్తోపాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతు అయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. సముద్రంలో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చి ముగ్గురు మృతిచెందడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో లోపలికి వెళ్లకూడదని, అలల తాకిడి ఎక్కువగా ఉందని మత్స్యకారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఇద్దరు
తెలంగాణలోనూ ఇద్దరు వ్యక్తులు హిమాయత్ సాగర్ బ్యాక్ మూసీలోకి దిగి గల్లంతు అయ్యారు. ఆదివారం పూట సరదాగా గడుపుదామని వచ్చి కనిపించకుండా పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో మూసీ బ్యాక్ వాటర్లోకి ఇద్దరు వ్యక్తులు దిగారు. సరదాగా ఈత కొడుదామనుకున్నారు. అయితే కాసేపటికి ఇద్దరూ కనిపించకుండా పోయారు.
గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతు అయిన యువకుల కోసం తీవ్రంగా గాలించారు. కానీ వారి ఆచూకీ మాత్రం కనిపించలేదు. యువకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాసేపు సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా అయ్యేసరికి ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
టాపిక్
