



Best Web Hosting Provider In India 2024
రుషికొండ భవనాలను ఎలా ఉపయోగిస్తే బెటర్ అంటారు? మెయిల్ చేయండి!
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను ఎలా ఉపయోగించుకోవాలో కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు భవనాలను ఎలా వినియోగిస్తే.. బాగుంటుందనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచలను ఆహ్వానించింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ.. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ను టూరిజం ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరింది. అక్టోబర్ 17న విజయవాడలో జరిగే సమావేశంలో పాల్గొనమని దేశీయ, అంతర్జాతీయ ఆతిథ్య సంస్థలను ఆహ్వానించింది. భవనాలు, దానికి ఆనుకుని ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి పౌరులు సూచనలు, ప్రతిపాదనలను సమర్పించాలని నోటిఫికేషన్ పేర్కొంది.
పర్యాటక ప్రమోషన్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, పర్యావరణ-పర్యాటక, ఆతిథ్య వెంచర్లు, సాంస్కృతిక కేంద్రాలు లేదా మిశ్రమ వినియోగ నమూనాలకు సంబంధించిన ఆలోచనలను మీరు పంపవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులు నోటీసు ఏడు రోజుల్లోపు తమ సూచనలను rushikonda@aptdc.in కు ఇమెయిల్ చేయాలని పర్యాటక శాఖ కోరింది.
అక్టోబర్ 17న విజయవాడలోని ఏపీ టూరిజం భవనంలో జరిగే సమావేశంలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కాన్సెప్ట్ నోట్స్ లేదా ఆసక్తి వ్యక్తీకరణలు(EOI) పంచుకోవాలని, పాల్గొనాలని నోటిఫికేషన్ ఆహ్వానించింది. ప్రస్తుత స్థితిని వివరిస్తూ, ఆ భవనాలు పనిచేయడం లేదని, ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.25 లక్షలు నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు చేస్తోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మొత్తం నిర్మాణ ప్రాంతం 13,542 చదరపు మీటర్లు, ఇందులో నాలుగు G+1 నిర్మాణాలు ఉన్నాయి. విజయనగర బ్లాక్ (మూడు యూనిట్లు), గజపతి బ్లాక్ (ఒక యూనిట్), కళింగ బ్లాక్ (ఒక యూనిట్), వెంగి బ్లాక్ (రెండు యూనిట్లు). ఈ కాంప్లెక్స్లో లగ్జరీ సూట్లు, బాంకెట్ హాళ్లు, రెస్టారెంట్లు, స్పా, జిమ్, కాన్ఫరెన్స్ హాళ్లు, లాంజ్లు, సిబ్బంది వసతి వంటి సౌకర్యాలు ఉన్నాయి.
గత ఏడాది నవంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి రుషికొండ ప్యాలెస్ను సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కోసం విలాసవంతమైన నిర్మాణాన్ని నిర్మించారని విమర్శించారు. రుషికొండపై నిర్మించిన భవనాలకు సంబంధించిన వీడియోలు ఆ సమయంలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
టాపిక్
