Food Waste: అన్నదాతల కష్టం కుప్పతొట్టెల్లోకి, ఆహార వృథాలో నిర్లక్ష్యం ఎవరిదీ?

Best Web Hosting Provider In India 2024

Food Waste: మీరు ఈ మధ్య ఎవరి పెళ్లికైనా వెళ్లారా? వెళితే అక్కడ బంధు మిత్రులకు వడ్డించిన భోజనం ఎలా ఉంది? అన్ని వంటల్నీ రుచి చూశారా? వడ్డించుకున్నదంతా తినేశారా? లేకపోతే ఏమైనా వదిలేసి ప్లేట్ ను పడేశారా? ఒకవేళ వదిలేస్తే అలా ఆహారాన్ని పడేయడం సరికాదని మీకు అనిపించలేదా? తినే తిండిని వృథా చేయడం తప్పని మీ మనసుకి తోచలేదా? మీరే కాదండోయ్.! దాదాపుగా అందరూ ఇదే తప్పు చేస్తున్నారు. పిడికెడు మెతుకుల కోసం అంగలార్చే అభాగ్యులు ఓ వైపు అన్నమో రామచంద్రా అంటుంటే ఆ మెతుకుల్ని యధేశ్చగా పారబోస్తున్న నిర్లక్ష్యపు మనుషులు ఇంకో వైపు కనిపిస్తున్నారు. ఆరుగాలం శ్రమిస్తూ అన్నదాత పండించే తిండి గింజల్ని కుప్ప తొట్టెల్లోకి చేర్చడం ఎంతటి దయనీయమో మీరే చెప్పండి? మన పొట్టకు పట్టేంత కాకుండా అమితంగా ఆహారాన్ని వడ్డించుకుని చివరికి దాన్ని తినలేక పారేస్తున్న వారు కోకొల్లలుగా కనిపిస్తుంటారు. పెద్ద పెద్ద వివాహాది శుభకార్యాల్లో ఎక్కడ చూసినా ఇదే అనాచారం దర్శనమిస్తోంది. ఈ ఫలితంగా విపరీతమైన ఆహార వృథా జరుగుతోంది. దీన్ని అరికడితే కొన్ని కోట్ల మంది అన్నార్తులకు ఆహారాన్ని అందించొచ్చు. దేశంలో ఏడాదికి సగటున 6.7 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు ఒక అంచనా. ఇది బిహార్ లాంటి రాష్ట్రానికి ఒక ఏడాదంతా కడుపు నింపడానికి సరిపోతుందట. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది నూటికి నూరుపాళ్ల నిజం. అడ్డగోలు ఆహార వృథాను అరికడితే దేశంలో ప్రతి రాత్రి 20 కోట్ల మంది ఖాళీ కడుపుతోనే నిద్రించే పరిస్థితి రాదని మేధావులు విశ్లేషిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

పెళ్లిళ్లలో 30 శాతం

ఆహారం ఎక్కువగా వృథా అయ్యేది వివాహాల్లోనే అనడంలో సందేహం లేదు. ఎక్కడ చూసినా సగటున 30 శాతం ఆహారాన్ని పారబోస్తున్నట్లు క్యాటరింగ్ నిర్వాహకుల అంచనా. కొన్ని సందర్భాల్లో ఒకే రోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుండటంతో అతిధుల సంఖ్య తగ్గడం, వచ్చిన వారు కూడా తినకుండా వెళ్లిపోవడం వల్ల ఆహారం మిగిలిపోతుంది. మాంసాహారంతో పాటు శాఖాహారం కూడా వడ్డించే చోట వృథా అధికంగా ఉంటుందని స్పష్టమవుతోంది. కాగా వినియోగించని ఆహారాన్ని ఇతరులకు ఇచ్చే సంస్కృతి మన దగ్గర 25 శాతంలోపే ఉండటం దురదృష్టకరం. మిగిలిన ఆహారాన్ని నేలపాలు చేసేస్తున్నారు. సాధారణంగా ఎంత ఆహారం మిగులుతుంది అనేది ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాతే వెలుగు చూస్తుంది. అప్పటికప్పుడు దీన్ని తరలించేందుకు సరైన వ్యవస్థతో పాటు నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో చెత్త కుప్పలకు తరలించడమే బాధాకరం.

వృథాకు ఇదీ కారణం..

మారుతున్న జీవనశైలి, ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. డబ్బు ఉంది కదా అని అనేక మంది వివాహాలు, ఇతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి అనగానే ప్రధానంగా విందు కోసమే భారీగా ఖర్చు చేయడం హోదాకు ప్రతీకగా భావిస్తున్నారు. సొసైటీలో తమ గొప్పతనాన్ని, హెూదాను చాటుకునేందుకు పదుల కొద్దీ పదార్ధాలను వడ్డిస్తున్నారు. వేడుకలకు అతిథుల్ని ఎక్కువగా ఆహ్వానిస్తుండగా వారు తింటున్నది కొంతైతే, వడ్డించుకున్న దాంట్లో పడేస్తున్నదే ఎక్కువగా ఉంటోంది. అతిథుల సంఖ్య సరిగ్గా అంచనా వేయలేకపోవడం ఒక కారణం కాగా ఆతిథ్య రంగం విస్తరించడమూ మరో కారణంగా కనిపిస్తోంది.

 

ఆ ఒక్క పెళ్లిలో వెయ్యి భోజనాలు వృథా

ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ పేరు మోసిన రాజకీయ నాయకుడి ఇంట్లో వివాహం జరిగింది. అతిథులకు వందలాది వంటకాలు ఏర్పాటు చేశారు. ఎంతో ఆర్భాటంగా జరిగిన ఆ వేడుకలో చివరికి 1000 మందికి సరిపడేటంత ఆహారం తినకుండానే మిగిలిపోయింది. దీని విలువ ఆరా తీస్తే రూ.6 లక్షలని తేలింది. అలాగే విజయవాడలో ఇటీవల ఓ ప్రముఖుడి కుటుంబంలో నిర్వహించిన వివాహంలో 150 రకాల వంటకాలు వడ్డించారు. అన్ని రకాలు ఎవరూ తినే అవకాశం లేకపోవడంతో భారీగా వృథా తప్పలేదు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వృథా ఎక్కువగానే ఉంటోంది. ఏటా లక్షల కొద్దీ వివాహాలు, ఇతరత్రా శుభ కార్యాలు జరుగుతుంటాయి. వీటన్నింటిలో 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతున్నట్లు అంచనా. కొన్ని పదార్థాలను రుచి చూడాలనే దృక్పదం, అన్నింటినీ వేసుకుని వేటినీ పూర్తిగా తినలేక పడేయడం జరుగుతోంది. సాధారణంగా బిర్యానీ వంటకాలు ఉన్నప్పుడు వృథా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సహజంగా ఆర్డర్ల ప్రకారం పదార్థాలు సిద్ధం చేస్తారు. అతిథుల సంఖ్య తగ్గినా.. కొన్నింటిని కొందరు తినకపోయినా మిగతా మొత్తం వృథా అవుతుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత మిగిలిపోయిన వాటిని ఎవరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. రాత్రి 12 గంటల తర్వాత పదార్థాలు మిగిలిన విషయం తెలుస్తుంది. ఆ సమయంలో వీటిని ఎవరికీ పంపిణీ చేయలేని పరిస్థితితో తప్పనిసరిగా పారేయాల్సిన అగత్యం ఏర్పడుతోంది.

 

విదేశాల్లో ఇలా

జర్మనీలోని హెూటళ్లు, రెస్టారెంట్లలో ఆహారాన్ని వదిలేస్తే ఒకటి నుంచి రెండు యూరోలు జరిమానా విధిస్తున్నారు. “తిను లేదా చెల్లించు” పథకాన్ని అక్కడ అమలు చేస్తున్నారు. అలాగే సిట్జర్లాండ్ లో ప్లేట్లో ఆహారం వదిలేస్తే జరిమానా విధించే పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఫ్రాన్స్ సర్కారు ఇటీవల కొత్త చట్టాన్ని తెచ్చింది. ఆహారం చెడిపోవడానికి ముందే వినియోగించాలి. ఆహారం చెడిపోయే పరిస్థితికి వస్తే ముందుగానే ధార్మిక సంస్థలకు వితరణ ఇవ్వాలి.

ఇలా అరికట్టొచ్చు..

ఇంట్లో భోజనం చేసినా, హెూటళ్లకు వెళ్లినా, వివాహాది శుభకార్యాల్లో అయినా ముందు తినగలిగినంత వడ్డించుకోవాలి. తొలుత వడ్డించుకున్నది పూర్తిగా తిన్న తర్వాత మనం ఎంత మేర తినగలమో ఓ అంచనాకు రాగలం. అప్పుడు మళ్లీ సరిపడ వడ్డించుకోవాలి. వేడుకలు నిర్వహించేటప్పుడు నిర్వాహకులు అతిథుల సంఖ్య విషయంలో పక్కాగా అంచనా వేసుకోవాలి. ఆ మేరకే సిద్ధం చేసుకోవాలి. అవసరమైతే మళ్లీ వండేందుకు ప్రణాళిక వేసుకోవాలి. ముఖ్యంగా తినగలిగే స్థాయిలోనే వంటకాల సంఖ్యను కుదించుకోవాలి. అప్పటికీ మిగిలిపోతే అలా మిగిలిన ఆహారాన్ని అన్నార్తులకు అందించే స్వచ్చంద సంస్థలకు అందజేయాలి.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *