Best Web Hosting Provider In India 2024

Nizamabad Crime : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు మాక్లుర్ లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపై కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్.. పథకం ప్రకారం ప్రసాద్ ను బయటకు తీసుకెళ్లి నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు.
ట్రెండింగ్ వార్తలు
స్నేహితుడే నరహంతకుడు
ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో.. ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. మాక్లుర్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే నర హంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించటం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.