Illegal Sand Mining : ‘మంజీరా’ మౌన రోద‌న‌- జోరుగా ఇసుక అక్రమ త‌వ్వకాలు!

Best Web Hosting Provider In India 2024

ఇసుక తవ్వకాలు

Illegal Sand Mining : అక్రమ ఇసుక ర‌వాణాతో మంజీరా మౌన రోదనకు గుర‌వుతోంది. ఒక‌టి కాదు రెండు కాదు రోజుకు వంద‌ల లారీల్లో ఇసుక‌ను అక్రమంగా రాష్ట్ర స‌రిహ‌ద్దు దాటిస్తున్నారు. ప్రభుత్వం మారినా ఈ అక్రమ ర‌వాణా ఆగ‌డం లేదు. ఫ‌లితంగా ఇసుకాస‌రులు రోజుకు ల‌క్షల్లో ప్రభుత్వానికి ద‌క్కాల్సిన సొమ్మును జేబులో నింపుకుంటున్నారు. ఇసుక మాఫియాతో కొంత‌మంది అధికారులు కుమ్మక్కు కావ‌డంతో జోరుగా దందా కొన‌సాగుతోంది. గ‌తంలో అధికార బీఆర్ఎస్ నాయ‌కుల అండ‌తో య‌థేచ్ఛగా ఈ దందా సాగింది. కానీ ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఓట‌మి పాల‌య్యింది. కానీ ఇసుక మాఫియాలో త‌మ‌కున్న ప‌ట్టుతో ఇంకా దందా కొన‌సాగిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొర‌వ తీసుకుని అక్రమ ఇసుక ర‌వాణా అడ్డుకోవాలని ప్రజ‌లు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇష్టారీతిన తవ్వకాలు

మంజీరా న‌ది నుంచి అనుమ‌తులు లేకున్నా జేసీబీల‌తో తవ్వకాలు జ‌రుపుతూ ప‌రివాహ‌క ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ త‌రువాత రాత్రి స‌మ‌యాల్లో లారీలు, టిప్పర్ల ద్వారా రాష్ట్ర స‌రిహ‌ద్దును దాటిస్తున్నారు. ఈ విష‌యాన్ని స‌మీప గ్రామాల ప్రజ‌లు అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారుల‌కు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ… ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఒక్కో లారీని రూ.35 వేల నుంచి రూ.40 వేల‌కు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మంజీరా న‌ది ప‌రివాహ‌క ప్రాంత‌లైన షట్లూర్, ఖథ్గాం, మెక్కా, హస్గుల్, గోపన్ పల్లి, పుల్కల్ గ్రామాల్లో డంప్‌లు వేసి క‌ర్నాట‌క, మ‌హారాష్ట్రకు త‌ర‌లిస్తున్నారు. పైగా జ‌రిమానాలు ప‌డ‌కుండా నెంబ‌ర్ ప్లేట్ లేని లారీల‌ను, టిప్పర్లను ఉప‌యోగిస్తూ దందా కొన‌సాగిస్తున్నారు. పైగా ఈ లారీలు, టిప్పర్లు మితిమీరిన వేగంతో న‌డిపించ‌డంతో ప్రమాదాలు కూడా కొన‌సాగుతున్నాయి.

పోలీసుల బందోబస్తుతో ఇసుక దందా

ఈ విష‌యంలో గతంలో బాధిత గ్రామాల ప్రజ‌లు ధ‌ర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం బాధిత ప్రజ‌ల‌కు సాంత్వన చేకూర్చాల్సింది పోయి.. పోలీసుల బందోబ‌స్తు న‌డుమ ఇసుక వ్యాపారం కొన‌సాగించింది. పైగా లారీల‌ను ఆపిన ప్రజ‌ల‌పై కేసులు న‌మోదు చేస్తామ‌ని బెదిరించింది. ఇక‌ ఇసుక కోసం వాగులో జేసీబీతో ఎక్కడబడితే అక్కడ లోతుగా తవ్వకాలు చేస్తుండ‌టంతో ప్రమాదాలు జ‌రుగుతున్నాయి. గుంతలు పడి ప్రజ‌లు, ప‌శువులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పోలీసులు అడ‌పాద‌డ‌పా ప‌ట్టుకున్న నామ‌మాత్రపు ఛార్జీలు విధిస్తుండ‌టంతో ఇసుక అక్రమ ర‌వాణా ష‌రా మాములుగా కొన‌సాగుతోంది.

రిపోర్టింగ్ : హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధి, నిజామాబాద్‌-కామారెడ్డి

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *