Minister Ponguleti : ఈ నెలాఖరులోగా మరో రెండు గ్యారంటీలు అమలు- మంత్రి పొంగులేటి

Best Web Hosting Provider In India 2024

Ponguleti Srinivas Reddy : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే 2 గ్యారంటీలను అమలు చేశామని, ఈ నెలాఖరులో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్ లో అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా నిర్వహించారు. గత పాలకులు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి తాళం చేతులు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. అయినా ఆసాకుతో మేము 6 గ్యారంటీల విషయంలో వెనక్కి తగ్గమని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలు ఆశించిన ఆశయాల మేరకు, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయమని అన్నారు. ప్రతి అంశంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

అధికారులకు స్వీట్ వార్నింగ్

సమీక్షలో పొంగులేటి జిల్లా అధికారులకు సున్నితంగా హెచ్చరించారు. ఇప్పటి వరకు చేసిన తప్పులను మీరే సరిదిద్దుకోవాలని మంత్రి సూచించారు. “జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా మీరు చెబితే నేను సరిదిద్దుతా.. నేను తెలుసుకుంటే సరిదిద్దను.. ఆ పరిస్థితి రావొద్దు” అంటూ చురకలు వేశారు. అధికారులు తమ శాఖలకు సంబంధించి కచ్చితమైన లెక్కలు ఇవ్వాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, రోడ్లు భవనాలు, డబుల్ బెడ్ రూమ్, వైద్యం, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్ష చేశారు. మిషన్ భగీరథ ద్వారా క్షేత్ర స్థాయిలో ఎన్ని గృహాలకు తాగునీటి సరఫరా చేస్తున్నది నివేదిక సమర్పించాలన్నారు. విద్యుత్ ఎన్ని గంటలు ఇస్తుంది తెలపాలన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు స్థల కేటాయింపు, ఫ్యాకల్టీ, పూర్తి స్థాయిలో కళాశాల నడిచేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

సీతారామ ప్రాజెక్టు పనులు

పాలేరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్ కు సంబంధించి 2 సబ్ డివిజన్లు ఉన్నట్లు, 143 గ్రామ పంచాయతీలు ఉండగా, 95 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండగా, 43 భవనాలు ఈజీఎస్ కింద మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన ఐదు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఈజీఎస్ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు కింద 2 ప్యాకేజీల పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అవసరంలేని భూములను చుట్టుపక్కల గ్రామాల నిరుపేదల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. పాలేరు లింక్ కెనాల్ కు సంబంధించి, భూసేకరణకు, రైతులతో మాట్లాడతానని, పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా నియోజకవర్గ పరిధిలో 5 కాలనీల్లో 97 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు, 2 కాలనీల్లో సంక్రాంతి లోగా పూర్తయే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికి కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు, గ్రామ సభ ద్వారా, లాటరీ ద్వారా, ఏ ప్రాతిపదికన కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు.

 

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలని మంత్రి పొంగులేటి అన్నారు. నిబంధనల మేరకు పనులు జరగాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఇబ్బందులు, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగులు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, పాలసీలపై ఇన్ పుట్ ఇవ్వాలని, సమిష్టిగా పని చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థను అతికొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తామని, వేతనాలు 1-5వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రారంభైన 50 శాతానికి పైగా పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని, మంజూరైన పనులు పునః సమీక్షించి, ప్రాధాన్యత ప్రకారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *