Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu january 8th Episode: వసుధార, మహేంద్రతో పాటు అనుపమ కూడా ఇంట్లో కనిపించకపోవడంతో భద్రలో అనుమానం మొదలవుతుంది. రిషిని కలవడానికే వెళ్లారని అనుకుంటాడు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని మహేంద్రకు కాల్ చేస్తాడు. తాము ఎక్కడున్నది భద్రకు మహేంద్ర చెప్పబోతుండగా వసుధార వచ్చి ఫోన్ కట్ చేస్తుంది. రిషి, తాను ఎక్కడున్నది ఎవరితో చెప్పొద్దని అంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఒకవేళ చెబితే మళ్లీ రిషి ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతుంది. మధ్యలో కాల్ కట్ కావడంతో తిరిగి భద్ర…మహేంద్రకు కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన మహేంద్ర తాము ఎక్కడున్నది అతడికి చెప్పడు. వసుధార, రిషిలతో కలిసి తాను ఉన్నాననే విషయం భద్రకు అనుమానం రాకుండా జాగ్రత్తపడతాడు. వసుధార మేడమ్ ఇంకా అని భద్ర అనగానే…వసుధార ఇంటికొచ్చిందా…ఎప్పుడొచ్చింది…ఇప్పటివకు ఎక్కడకు వెళ్లింది అని ఎగ్జైటింగ్గా మహేంద్ర అడుగుతాడు. వసుధార గురించి తనకు ఏం తెలియదని భద్రను నమ్మిస్తాడు మహేంద్ర. రౌడీల నుంచి తప్పించుకున్న వసుధార ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆలోచనలో పడతాడు భద్ర. మహేంద్ర మాటలను నిజమేనని నమ్ముతాడు.
మహేంద్ర ఎమోషనల్…
రిషి దగ్గరకు వస్తాడు మహేంద్ర. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనని ఎమోషనల్ అవుతాడు. మీ అమ్మ ప్రేమను పంచినట్లే పంచి మధ్యలోనే వెళ్లిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రతిక్షణం, ప్రతి రోజు మీ అమ్మను తలచుకుంటూనే బతుకుతున్నానని అంటాడు. జగతిని మర్చిపోలేకపోతున్నానని చెబుతాడు. జగతి దూరమైనప్పుడే సగం చచ్చిపోయాను.
ఇప్పుడు నీకు ఏమైనా అయితే పూర్తిగా చచ్చిపోతానని రిషితో చెప్పి బాధపడతాడు మహేంద్ర. మీరు అధైర్యపడొద్దు..నేను బాగానే ఉంటాను. నాకేం కాదు అని మహేంద్రను ఓదార్చుతాడు రిషి. వసుధార కూడా మహేంద్రలో ధైర్యం నింపుతుంది. రిషికి తోడుగా నేను ఉన్నాను. ఆయనకు ఏం కాకుండా చూసుకుంటానని మాటిస్తుంది. జగతి దూరమైన తర్వాత కూడా తాను బతికి ఉన్నది రిషి కోసమేనని, నాప్రాణం రిషి దగ్గర ఉందని వసుధారతో అంటాడు మహేంద్ర.
శత్రువులకు అనుమానం…
నీ గురించి కాలేజీలో అడుగుతున్నారని, కాలేజీ వస్తావా అని వసుధారను అడుగుతాడు మహేంద్ర. నువ్వు కాలేజీలో కనిపించకపోతే శత్రువులకు అనుమానం వస్తుందని అంటాడు. రిషి పూర్తిగా కోలుకునే వరకు తాను కాలేజీకి రాలేనని అంటుంది వసుధార. ఫణీంద్రకు ఫోన్ చేసి కాలేజీకి రాకపోవడానికి ఏదైనా ఒక కారణం చెప్పమని వసుధారతో అంటాడు మహేంద్ర.
కాలేజీ బోర్డ్ మీటింగ్…
కాలేజీ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయిస్తాడు శైలేంద్ర. రిషితో పాటు వసుధార కూడా కనిపించడం లేదని, వాళ్లు ఎప్పుడొస్తారని బోర్డ్ మెంబర్స్ ఫణీంద్రను అడుగుతారు. రిషి, వసుధార ఎండీ బాధ్యతల్ని బాగా నిర్వర్తించారని, కానీ వసుధార మాత్రం పనిమీద శ్రద్ధ చూపించడం లేదని, ఆ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకుందని బోర్డ్ మెంబర్స్ అంటారు. రిషి, వసుధార ఎప్పుడొస్తారో తెలియదు కాబట్టి మీరు ఒప్పుకుంటే ఎండీ బాధ్యతలు శైలేంద్రకు అప్పగిద్దామని బోర్డ్ మెంబర్స్ ఫణీంద్రను కోరుతారు. ఫణీంద్ర మాత్రం అందుకు ఒప్పుకోడు. ఎండీ సీట్ విషయంలో ఏ నిర్ణయమైనా వసుధారనే తీసుకోవాలని అంటాడు. వసుధారకు ఫోన్ చేస్తాడు.
వసుధార అబద్ధం…
ఫణీంద్ర ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన వసుధార తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడటానికి వచ్చానని, తొందరలోనే కాలేజీకి వస్తానని చెబుతుంది. కాలేజీ బాధ్యతల విషయంలో బోర్డ్ మెంబర్స్ గొడవ చేస్తున్నారని ఫణీంద్ర చెప్పిన మాటలకు తాను వచ్చిన తర్వాత అన్నింటికి సమాధానం చెబుతానని వసుధార బదులిస్తుంది.
వసుధార అబద్ధం చెబుతుందని శైలేంద్ర గ్రహిస్తాడు. వసుధార వచ్చిన తర్వాతే ఎండీ విషయంలో నిర్ణయం తీసుకుందామని చెప్పి బోర్డ్ మీటింగ్ను క్లోజ్ చేస్తాడు ఫణీంద్ర. ఎండీ సీట్ కోసం వేసిన ఈ ప్లాన్ కూడా ఫెయిలవ్వడంతో శైలేంద్ర నిరాశపడతాడు.
శైలేంద్ర ప్లాన్…
వసుధార తండ్రి దగ్గరే కొన్ని రోజులు ఉంటానని అంటుందంటే ఆయనకు ఎలా ఉందో ఓ సారి చూసొద్దామని తండ్రితో అంటాడు శైలేంద్ర. వాళ్లకు మనం తప్ప ఎవరూ లేరని చెబుతాడు. వసుధార ఏదో దాస్తుందని అదేదో తెలుసుకోవడానికి తండ్రితో కలిసి అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఫణీంద్ర మాత్రం వద్దని అంటాడు. ఏదైనా అవసరం ఉంటే వసుధారనే కాల్ చేస్తుందని, అప్పుడు వెళ్ధామని అంటాడు.
వసుధార తండ్రి దగ్గర ఉండటం వెనుక ఏదో సీక్రెట్ దాగి ఉందని శైలేంద్ర అనుకుంటాడు. భద్రకు ఫోన్ చేస్తాడు శైలేంద్ర. వసుధార ఎక్కడుందో తనకు తెలిసిందని, అక్కడికి వెళ్లి వసుధార ఏం చేస్తుందోకనుక్కోమని అంటాడు. రిషి కూడా అక్కడే ఉన్నాడని తనకు అనుమానంగా ఉందని, ఆ విషయంలో తనకు క్లారిటీ కావాలని భద్రకు సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర.
వసుధారకు షాక్…
శైలేంద్ర దగ్గర చక్రపాణి అడ్రెస్ తీసుకొని నేరుగా అక్కడికి వస్తాడు భద్ర. వసుధారను కలుస్తాడు. అతడిని చూసి వసుధార షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు…ఎందుకు వచ్చావని భద్రను నిలదీస్తుంది వసుధార. మీ క్షేమం నాకు ముఖ్యమని, మీపై ఎటాక్స్ జరగడం దగ్గరుండి తాను చూశానని, అందుకే మీరు ఎక్కడున్నారో తెలుసుకొని వచ్చానని భద్ర అబద్ధం ఆడుతాడు. మీరు ఒంటరిగా ఎక్కడికో వెళితే నేను ఎలా సెలైంట్గా ఉంటాను. ఉండలేను కూడా అందుకే మీ అడ్రెస్ కనుక్కున్నానని చెబుతాడు.
ఇంట్లోకి అనుమానంగా చూస్తాడు భద్ర.లోపలికి వెళ్లి రిషి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి నాటకం ఆడుతాడు. ఈ ఇళ్లు చూస్తుంటే నమ్మబుద్ది కావడం లేదని అంటాడు. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మీతో ఎవరో అబద్ధం చెప్పిస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదని భద్రకు సీరియస్గా బదులిస్తుంది వసుధార.
భద్ర ప్రశ్నలు…
ఇంతలో లోపలి నుంచి రిషి దగ్గడం భద్రకు వినిపిస్తుంది. వసుధారను తోసుకొని లోపలికి వస్తాడు భద్ర. ఇంట్లో ఎవరో ఉన్నారని అంటాడు. వసుధార ఎంత వారించిన వినడు. అతడికి ఎదురుగా చక్రపాణి రావడంతో ఇందాక నువ్వు విన్న దగ్గు నాన్నదేనని భద్రతో అంటుంది వసుధార.
ఇప్పుడే మీరు నాతో రావాలని వసుధారను పట్టుపడతాడు భద్ర. వసుధార రానని అన్న వినడు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. నేను రానని, ఇక్కడ నాకు కొన్ని పనులు ఉన్నాయని భద్రతో అంటుంది వసుధార. ఏం పనులో నాకు చెప్పాలని, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్లనని పట్టుపడతాడు భద్ర. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే మహేంద్రకు చెప్పి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసివేయిస్తానని భద్రకు వార్నింగ్ ఇస్తుంది వసుధార. వసుధార మాటలకు భయపడి భద్ర వెళ్లిపోతాడు.
మహేంద్ర అనుమానం…
ఆ తర్వాత భద్ర తనను వెతుక్కుంటూ వచ్చిన విషయం మహేంద్రకు ఫోన్ చేసి చెబుతుంది వసుధార. మేము ఇక్కడున్న విషయం అతడితో చెప్పారా అని మహేంద్రను అడుగుతుంది వసుధార. తాను ఎవరికి మీ అడ్రెస్ ఇవ్వలేదని మహేంద్ర బదులిస్తాడు. మరీ భద్ర ఎక్కడికి ఎలా వచ్చాడంటూ వసుధార అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ విషయాలు తాను తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.