Best Web Hosting Provider In India 2024

ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారు
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా
తాడేపల్లి: ప్రజల్లో గుర్తింపు లేని చంద్రబాబు, ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేని పవన్ కల్యాణ్.. వీరిద్దరూ కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయగలరని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా..? అని పవన్ను నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కుప్పంలో ఓటమి ఖాయమని, కుప్పం ప్రజలు తనను తరిమికొడతారని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. ఒకరోజు లక్షల ఓట్లు తొలగించారని, మరోరోజు లక్ష ఓట్లు జోడించారని ఎల్లో మీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తున్నాడన్నారు. చంద్రబాబు, పవన్ యుద్ధంలోకి రాకముందే అస్త్రసన్యాసం చేశారని, వైయస్ జగన్ను ఎదుర్కోలేమని తెలిసి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి వైయస్ఆర్సీపీపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దళితులను అవమానించిన చంద్రబాబును పవన్ పక్కనబెట్టుకున్నాడన్నారు.