Best Web Hosting Provider In India 2024

Pesarapappu Puri: ఒకేలాంటి బ్రేక్ ఫాస్ట్లు తిని బోరు కొట్టిందా? ఓసారీ పూరీ చేసుకుని తినండి. పూరీ ఎప్పటిలా మైదా లేదా గోధుమపిండితో కాకుండా పెసరపప్పుతో చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు. రాజస్థానీలు దీన్ని ఇష్టంగా తింటారు. ఈ పూరీలను కేవలం పావుగంటలో చేయవచ్చు. వీటి రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
పెసరపప్పు పూరీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు – అర కప్పు
అల్లం తరుగు – ఒక స్పూను
గోధుమ పిండి – ఒక కప్పు
జీలకర్ర – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఇంగువ – చిటికెడు
నూనె – తగివనంత
మిరియాల పొడి – అర స్పూను
పెసరపప్పు పూరీ రెసిపీ
1. పెసర పప్పును ముందుగానే రెండు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
2. నానబెట్టిన పెసరపప్పును మిక్సీ జార్లో వేయాలి. అందులోనే జీలకర్ర, అల్లం తరుగు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, మిరియాల పొడి, నీరు వేయాలి.
4. ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని పూరీ పిండిలా వేసి బాగా కలుపుకోవాలి.
6. పిండిని పావుగంట సేపు గిన్నెలో వేసి మూత పెట్టి అలా వదిలేయాలి.
7. తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. నూనె వేడెక్కాక పిండి నుంచి చిన్న ముద్దను పూరీలా ఒత్తుకుని నూనెలో వేయాలి.
9. రెండు వైపులా పూరీలను కాల్చుకున్నాక తీసుకుని టిష్యూ పేపర్ మీద వేయాలి. అదనపు నూనెను పేపర్ పీల్చేసుకుంటుంది.
10. అంతే టేస్టీ పూరీలు రెడీ అయినట్టే. దీన్ని ఆలూకుర్మాతో తింటే రుచి అదిరిపోతుంది.
సాధారణ పూరీలతో పోలిస్తే పెసరపప్పు పూరీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెసరపప్పులో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటుంది. పెసరపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి పెసరపప్పును వారంలో కనీసం నాలుగైదు సార్లు తినడం చాలా మంచిది.
టాపిక్