Best Web Hosting Provider In India 2024

దేవుడు, ప్రజలు సీఎం వైయస్ జగన్ పక్షానే నిలబడ్డారు
పాజిటివ్ ఓట్ల సునామీతో వైయస్ జగన్ మళ్లీ సీఎం
రాష్ట్రంలో హింస దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే..
ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్లో బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు దాడులు
వైయస్ఆర్సీపీకి ఓట్లేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలపైనే దాడులు
పచ్చచొక్కాలేసుకుని పనిచేసిన పోలీసులపై చర్యలు ఉంటాయి
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల అంతిమతీర్పులో వైయస్ఆర్సీపీదే విజయం
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
తాడేపల్లి: ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం, వైయస్ జగన్మోహన్రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దేశచరిత్రలోనే ముందెన్నడూ ఎరుగని విధంగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం పనితీరును మెచ్చిన పాజిటివ్ ఓటింగ్ ప్రభావం కనిపించనుందన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా మహిళా అక్కచెల్లెమ్మలంటూ వైయస్ జగన్ గొప్ప పరిపాలనతో వారి ఆదరాభిమానాలు పొందారన్నారు. ఈ క్రమంలో ఆయా వర్గాలన్నీ సరైన తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా చూడబోతున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.
మంత్రి మేరుగు నాగార్జున ఇంకా ఏం మాట్లాడారంటే..
మా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి మొదట్నుంచీ చెబు తున్నట్టుగానే.. ఈ ఎన్నికలు పేదలకు పెత్తందార్లకు నడుమ జరిగిన యుద్ధంగానే సాగింది. పెత్తందార్ల పక్షాన నాయకులుగా చంద్రబాబు, పవన్కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు అదేపనిగా దుమ్మెత్తి పోస్తే.. ప్రజలు మాత్రం మా నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డేనంటూ అరుదైన తీర్పును ఇచ్చారనేది రేపటి ఫలితాల్లో చూడబోతున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ వైయస్ఆర్సీపీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఫ్రస్టేషన్ తట్టుకోలేక దాడులకు ఉసిగొల్పిన చంద్రబాబు
జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్సీపీ గొప్ప ఘన విజయాన్ని నమోదు చేసుకుంటుంది. ఫలితాల ప్రారంభం నుంచి ముగింపు వరకు వైయస్ఆర్ సీపీ సానుకూల తీర్పు సునామీ సృష్టించనుంది. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఫ్రస్టేషన్కు గురయ్యాడు. దీంతో రాష్ట్రంలో దాడులు, అఘాయిత్యాలు చేసి రావణ కాష్టానికి పూనుకోవడానికి బరితెగించాడు. ఇవాళ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతోన్న దాడులు, అఘాయిత్యాలకు కారణమవుతున్నా డు.
వైయస్ఆర్సీపీకి ఓట్లేశారన్న కక్షతో పేదలపై ప్రతాపం
మరీ ముఖ్యంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారన్న కక్షతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదలపై దాడులకు పాల్పడుతున్న తీరును రాష్ట్రప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. పల్నాడు జిల్లా కొణిదెలలో ఒక బీసీ మహిళ వైయస్ఆర్సీపీకి ఓటేసిందని ఆమెపై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. మాచర్లలోనూ బేడబుడగజంగాల సామాజికవర్గ ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. చిలకలూరిపేటలో ఒక ఎస్సీ వ్యక్తి వైయస్ఆర్సీపీ ఏజెంట్గా ఉన్న కారణంగా అతని ఇంటిపై దాడిచేయించిన పరిస్థితిని చూశాం. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలోని దళితుల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పెదకూరపాడు కంభంపాడులో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపైకి వెళ్లి దౌర్జన్యం చేసి వాళ్లను ఇష్టారీతిన కొట్టడాలు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అశాంతిని రగిల్చాడు.
చంద్రబాబు కుట్రే దాడులకు కారణం
ఈ పేదవాళ్లను బతకనీయకూడదనేది అతని ఆలోచనగా అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే, పేదవర్గాలంతా వైయస్ జగన్మోహన్రెడ్డితో పాటు యాత్రగా అడుగులేశారో.. ఆయనకు కొమ్ముకాసిన రోజే చంద్రబాబు తీవ్రమైన ఉక్రోషానికి గురై దాడులకు కుట్ర చేశాడు. జిల్లాలవారీగా తమ అనుచరులకు పిలుపునిచ్చిన మేరకు గ్రామాల్లో ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైయస్ఆర్సీపీ అనుకూల సామాజికవర్గాలు, ప్రాంతాలపై దాడులు చేసి మారణహోమానికి పాల్పడ్డారు.
ఎన్నికల కమిషన్ కూటమితో కుమ్మక్కైందా..?
ఎన్నికల క్రమంలో చాలాచోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉండాలని వైయస్ఆర్సీపీ తరఫున ఎన్నికల అధికారులకు అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే, గొడవలకు.. రిగ్గింగ్ చేయడానికి ఆస్కారమున్న ప్రాంతాల్ని వదిలేసి.. వైయస్ఆర్సీపీ అనుకూల ప్రాంతాల్లో మాత్రమే పోలీసులను ఎక్కువ సంఖ్యలో పెట్టారు. ఎక్కడైతే, టీడీపీ సానుకూల బలమైన కేడర్ ఉంటుందో.. అక్కడ పోలీసు బందోబస్తును పెట్టడంలో యంత్రాంగం ఫెయిల్అయ్యింది. ఇదంతా కావాలనే చేసినట్టు తెలుస్తోంది. అంటే, దీన్నిబట్టి చూస్తే ఎన్నికల కమిషన్, పోలీసుయంత్రాంగం కూటమితో కుమ్మక్కైందా..? అనే అనుమానా లొస్తున్నాయి. వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎలాంటి పరిస్థితుల్లో గెలవనీయకూడదనే పక్కా ప్రణాళిక ప్రకారం ఆయా వ్యవస్థలు పనిచేశాయేమోననే అనుమానాలున్నాయి.
పచ్చచొక్కాలేసుకున్న పోలీసులపై చర్యలుంటాయి
నిన్నటి ఎన్నికల్లో చాలాచోట్ల పోలీసు అధికారులు పచ్చచొక్కాలేసు కున్నట్టుగా రెచ్చిపోయి పనిచేశారు. ఒకపక్క దాడులు జరిగే చోట్లకు ఏ ఒక్క పోలీసు వెళ్లలేదు. టీడీపీ శ్రేణులను కట్టడి చేయడంలో పూర్తి విఫలమయ్యారు. మా నాయకుల్ని హౌస్అరెస్టులు చేశారు. పోలింగ్ బూత్ల సరిహద్దుల్లోకి కూడా రాకుండా కట్డడి చేశారు గానీ.. టీడీపీ అభ్యర్థులు, వారి నేతలను మాత్రం ఇష్టానుసారంగా చేసుకోండని వదిలేశారు. మీరెన్ని కుట్రలు చేసినా.. రేపు మరలా వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అనే విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నాం. మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు ఎవరైతే టీడీపీకి అనుకూలంగా రెచ్చిపోయి పనిచేశారో.. వారి పనితీరుపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తాం. ఏకపక్షంగా పనిచేసిన అధికారులపై ఆధారాలతో సహా చూపించి మరీ చర్యలు చేపడతాం.
కేంద్రం నుంచి వచ్చిన పోలీసు అబ్బర్వర్ కళ్లుమూసుకున్నాడా..?
కేంద్రం ఈ రాష్ట్రానికి ఒక పోలీసు అబ్జర్వర్ను కేటాయించారు. మరి, ఆ అధికారి ఎక్కడున్నాడో.. ఆయనేం చూస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ, నిన్నటి ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం తీరు చంద్రబాబుకు, తెలుగు దేశం పార్టీ అడుగులకు మడుగులొత్తినట్టే ఉంది. ఎంతసేపటికీ, వైయస్ఆర్సీపీ శ్రేణులను నిలువరించడమే పనిగాఉన్నారు తప్ప ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించలేదు. ఈరోజుకు, ఇప్పటికీ గ్రామాల్లో దాడులు, అఘాయిత్యాలు జరుగుతుంటే.. పోలీసు యంత్రాంగం ఎందుకు నియంత్రించలేకపోతుంది..? మిమ్మల్ని ఆపిన కీలకం ఎక్కడుంది..? చంద్రబాబు ఓడిపోతున్నాడని.. ఆయన కేంద్రంతో లాలూచీ అయ్యాడని.. అందుకే, పోలీసులను పావుగా చేసుకుని పేట్రేగి పోతున్నాడనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.
దేవుడు, ప్రజలు వైయస్ జగన్ పక్షానే ఉన్నారు
రాష్ట్రంలో జరుగుతోన్న దాడులు, కుట్రలకు ప్రధాన కారణం.. ప్రధాన ముద్దాయి చంద్రబాబు. ఆయన కేంద్రం సహకారంతో ఎన్నికల అబ్జర్వర్లను, పోలీసులును కొనుగోలు చేసి ఎంత మేనేజ్ చేసినా.. ప్రజాక్షేత్రంలో తీర్పు మాత్రం భిన్నంగా రానుంది. గడచిన ఐదేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, అగ్రవర్ణ పేదలను కంటికిరెప్పలా చూసుకున్న పేదల నాయకుడు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు వారంతా సరైన తీర్పును ఇప్పటికే ఓట్లేసి ఇచ్చారు. దేవుడు కూడా నిజాయితీ, విశ్వసనీయత వైపు ఉంటాడు కనుక మీరెంత కుట్రలు గట్టినా ఖచ్చితంగా న్యాయం గెలుస్తోంది. వైయస్ఆర్సీపీ గెలుపుతో ప్రజల విజయం ఖాయమవుతోంది. జూన్ 4న వెలువడే ఫలితాల సునామీతో మరలా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.