
Best Web Hosting Provider In India 2024

TTD August Online Quota: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్లు రేపు విడుదల కానున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ అధికారిక వెబ్సైట్లో శనివారం విడుదల చేస్తారు. ఆగస్టులో శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవల్ని పొందాలనుకునే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. దీంతో పాటు పలు రకాల సేవలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లో వీటిని బుక్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిప్ ద్వారా ఎంపికైన వారికి మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత సొమ్మును చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరు చేస్తారు.
ఆగస్టు నెలలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
మే 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు….
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించే వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. .
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా…
శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే వారికి బస కల్పించే కోటాను కూడా మే 24 విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
మే 27న శ్రీవారి సేవ కోటా విడుదల
మే 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వాలంటీర్లుగా ఈ సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
షెడ్యూల్ ప్రకారం ఈ సేవల్ని ముందుగానే https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
టాపిక్