Best Web Hosting Provider In India 2024
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అక్కడ ఉన్న విద్యుత్తు శాఖ అధికారులకు దేహశుద్ధి చేశారు. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
వనపర్తి గ్రామంలో విద్యుత్తు సరఫరాకు సంబంధించిన పనులు చేసేందుకు శుక్రవారం స్థానిక ఏఈ, డీఈ, ఇతర అధికారులు వచ్చారు. అయితే కరెంట్ పోల్ ఎక్కి లోపాలను సరి చేయాల్సిన అధికారులు గ్రామానికి చెందిన కుక్కల మల్లేశం అనే ప్రైవేటు హెల్పర్ ను స్తంభం ఎక్కించారు. ముందుగా విద్యుత్తు సరఫరా నిలిపి వేసి, స్తంభం ఎక్కించినప్పటికీ ఆ తరువాత స్తంభానికి ఉన్న వైర్లకు కరెంట్ సప్లై జరిగింది. దీంతో స్తంభంపైనే ఉండి పనులు చేస్తున్న కుక్కల మల్లేశం విద్యుదాఘాతానికి గురయ్యాడు. కనీసం స్తంభం దిగే పరిస్థితి కూడా లేకపోవడంతో మల్లేశం కరెంట్ షాక్ తో విలవిలలాడాడు. ఆ కొద్దిసేపటికే మల్లేశం స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు.
విద్యుత్ శాఖ అధికారులపై దాడి
స్తంభంపై పనులు చేస్తున్న మల్లేశం అక్కడే చనిపోవడంతో అక్కడున్న అధికారులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే మల్లేశం ప్రాణాలు కోల్పోగా, గమనించిన వనపర్తి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
విద్యుత్తు శాఖ అధికారులు ఎల్సీ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే మల్లేశం ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామానికి వచ్చిన ఏఈ, డీఈలపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకోని, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే అమాయకుడి ప్రాణాలు తీసిందని గ్రామస్థులు మండిపడ్డారు.
అధికారుల తప్పిదంతో మల్లేశం కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గ్రామస్థులు కోపంతో రగిలిపోతుండటంతో పోలీసులు విద్యుత్తు శాఖ అధికారులను సురక్షితంగా బయటకు తరలించారు. కాగా మల్లేశం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గతంలోనూ ఓ యువకుడి మృతి
వనపర్తి గ్రామంలో గతంలోనూ విద్యుత్తు శాఖ అధికారుల తీరు వల్ల ఓ యువకుడు ప్రాణాలు పోయాడు. ఈ ఏడాది మార్చి నెలలో విద్యుత్తు లైన్లను సవరించేందుకు సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన మహేందర్ అనే యువకుడిని స్తంభం ఎక్కించి పనులు చేపట్టారు. దీంతో ప్రమాదవశాత్తు మహేందర్ స్తంభం పైనుంచి తీవ్ర గాయాల పాలయ్యాడు.
అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో కూడా మహేందర్ మృతికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండి పడుతూ గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు. జనగామ–-సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపచేశారు.
ఇదిలా ఉంటే విద్యుత్తు శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము చేయాల్సిన పనులను ప్రైవేటు వ్యక్తులతో చేయించడమే కాకుండా వారి మరణాలకు కారణమవుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్