Mulugu District : కూతురును సాగనంపేందుకు వెళ్తుండగా విషాదం – రోడ్డు ప్రమాదంలో తల్లి, తండ్రితో పాటు డ్రైవర్ మృతి

Best Web Hosting Provider In India 2024

కూతురును అత్త గారింటికి పంపించేందుకు తల్లిదండ్రులు వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఉన్న గేదె కళేబరాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, తండ్రితో పాటు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, కూతురు, ఆటోలు ఉన్న మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేషనల్ హైవే 163పై శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

ములుగు జిల్లా వాజేడు గ్రామానికి చెందిన కాకర్లపూడి సత్యనారాయణరాజు అలియాస్ ఎర్రబాబు(75), సత్యవతి(65) భార్యాభర్తలు. వారి కూతురు అనితను కొంతకాలం కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ తుని ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఇదిలాఉంటే కొద్ది రోజుల కిందట అనిత తల్లిగారింటికి వచ్చింది. తిరిగి ఆమెను అత్తగారింటికి పంపించేందుకు సత్యనారాయణరాజు ఫ్యామిలీతో సహ బస్టాండ్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. 

ఈ క్రమంలోనే తమ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తలండి నాగరాజు(20)ను మాట్లాడుకున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి నాగరాజు ఆటోలో బస్టాండ్ కు బయలు దేరగా, నాగరాజు తనకు సహాయంగా అదే గ్రామానికి చెందిన పెనుమళ్ల అంజిరెడ్డి అనే వ్యక్తిని తీసుకెళ్లాడు. ఐదుగురు కలిసి ఆటోలో బయలుదేరి ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఎన్హెచ్ 163 హైవే మీదుగా వెళ్తున్నారు.

గేదె కళేబరాన్ని తప్పించబోయి..

ఆటో వెళ్తున్న మార్గంలో నాలుగు రోజుల కిందట అక్కడ ఓ గేదె గుర్తు తెలియని వాహనం ఢీ కొని మృతి చెందింది. కానీ దానిని తొలగించకపోవడంతో నాలుగు రోజులుగా గేదె కళేబరం రోడ్డుపైనే ఉంటోంది. ఇదిలాఉంటే సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఆటో అక్కడికి చేరుకోగా, ముందు ఉన్న గేదె కళేబరాన్ని తప్పించబోయి నాగరాజు వెహికిల్ ను రైట్ సైడ్ కు తప్పాడు. వాహనం కొంత వేగంగా ఉండటంతో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఆటో ఢీ కొట్టింది. 

 

ఎదురెదురుగా ఢీకొనడం, వాహనాలు స్పీడ్ మీద ఉండటంతో ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ రాజు, సత్యవతి, ఆటో డ్రైవర్ నాగరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆటోలో ఉన్న అనిత, మరో యువకుడు అంజిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108 అంబులెన్స్ లో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై తాజొద్దీన్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృత దేహాలను ట్రాక్టర్ ద్వారా తరలించారు. కంటైనర్ లారీతో సహా డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా జగన్నాథ పురం వద్ద గ్రామస్థులు అడ్డుకుని లారీని నిలిపి వేశారు. కాగా లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఏటూరు నాగారం పోలీసులు వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

 

WhatsApp channel
 

టాపిక్

 
Telangana NewsCrime NewsWarangal
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024