Best Web Hosting Provider In India 2024

YS Jagan in Vinukonda : వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా(ఇండియా టుడే)తో మాట్లాడిన జగన్… ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీతో పాటు పలువురిని కలుస్తామన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు.
వినుకొండలో మాట్లాడిన జగన్… రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ లేదన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారని దుయ్యబట్టారు. దొంగ కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు. దిశా యాప్ తో ఫిర్యాదులు స్వీకరించాం. గత ప్రభుత్వం సకాలంలో విద్యా, వసతి దీవెన ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వటం లేదు. జగనే ఉండి ఉంటే రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ డబ్బులు, మత్స్యకార డబ్బులు వచ్చేవి. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలను విస్మరించే పనిలో ఉన్నాడు. చెప్పిన హామీల గురించి ప్రజలు అడిగే పరిస్థితులు ఉన్నాయి” అని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని జగన్ తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఇదే కాకుండా మంగళవారమే వైసీపీ నేతలు ఢిల్లీకి చేరుకొని బుధవారం ధర్నా చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాను కలుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిస్తామని వివరించారు.
ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలనే అంశంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని జగన్ తెలిపారు. రషీద్ హత్య కేసులో పోలీసులు తీరు దారుణంగా ఉందన్నారు. లేని కేసులు ఉన్నాయని పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను సీఎం చంద్రబాబు ఖండించి… ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని పోలీసులు సరైన మార్గంలో నడవాలని డిమాండ్ చేశారు.
టాపిక్