
Best Web Hosting Provider In India 2024

ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలను ఔత్సాహిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలి విడతలో రూ.55 కోట్లతో 129 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నవంబరు రెండో వారంలో వీటిని ప్రారంభించనున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ప్రాజెక్టు వ్యయం ఉండే పరిశ్రమల ద్వారా మహిళలకు ఉపాధి కల్పించనున్నారు. ఈ మొత్తం వ్యయంలో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. 10 శాతం లబ్ధిదారుని వాటా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణంగా అందిస్తుంది. ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎంఎఫ్ఎమ్ఈ, పీఎంఈజీపీలను అనుసంధానిస్తారు. తొలి విడతలో అమలు తీరును బట్టి రెండో విడతలో మరో 13 వేల మందికి లబ్ధిచేకూరేలా చర్యలు చేపట్టనున్నారు.
తొలివిడతలో 129 సూక్ష్మ, చిన్న తరహా ప్రాజెక్టులను వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తామని ఆసక్తి చూపిన వారికి ప్రభుత్వం కేటాయించింది. వీరిలో 64 మంది మహిళలు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నారు. మరో 65 మంది ఇప్పటికే ఉన్న బిజినెస్ ను మరింతగా విస్తృతపరుచుకుంటున్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలలో… జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, బెల్లం ఉత్పత్తి, ఆయిల్ మిల్లు, హైజిన్ ప్రొడక్ట్స్, మిల్లెట్ అండ్ హెర్బల్ యూనిట్, బేకరీ, స్నాక్స్ యూనిట్, డెయిరీ ఫాం, కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, సిమెంట్ బ్రిక్స్ యూనిట్, ఎంబ్రాయిడరీ, ఐస్క్రీమ్ తయారీ, గార్మెంట్స్, తేనే తయారీ, కారంపొడి తయారీ ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు
ఇప్పటికే ఈ ప్రాజెక్టుల డీపీఆర్ లు పూర్తి చేసి, బ్యాంకుల నుంచి రుణాలు కూడా మంజూరు చేయించారు. లబ్దిదారులు తమ వ్యాపారాల అవసరాల నిమిత్తం ఈ రుణాలను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లబ్దిదారులు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఇప్పటి వరకూ పొదుపునకే పరిమితం అయ్యారు. అయితే వీరికి మరింత ప్రోత్సాహం అందిస్తే…సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో రాణిస్తారని ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించింది. అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికసాయం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో డ్వాక్రా మహిళల పాత్ర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఆహారశుద్ధి, ఎంఎస్ఎంఈ, రైల్వే, నేషనల్ హైవేలు సహా పలు శాఖల పరిధిలో అమలయ్యే పథకాల్లో డ్వాక్రా మహిళలను భాగస్వాముల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామిక వేత్త నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం నాబార్డు నిధుల్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నిధులతో మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పన చేపట్టాలని భావిస్తోంది. డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు అందిస్తున్నారు. వీటిని మహిళలకు కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ రుణాల పరిమాణం పెంచి, మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త ప్రణాళికలు అమలుచేస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్