




Best Web Hosting Provider In India 2024

AP Anganwadi : అంగన్వాడీ వర్కర్, హెల్పర్లకు రూ.15,000- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Anganwadi : అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల సమ్మె డిమాండ్లను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలుచేస్తుంది. అంగన్ వాడీ వర్కర్, హెల్పర్ మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు అందించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP Anganwadi : అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. మరణించిన అంగన్వాడీ వర్కర్, హెల్పర్లకు అంత్యక్రియల సాయం కింద రూ.15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేపట్టారు. అప్పటి ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ నేతలతో చర్చలు చేపట్టింది. 2024 జనవరి 22న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ నేతలు జరిపిన చర్చలు సానుకూలం అయ్యాయి.
దీంతో అదే రోజు అర్ధరాత్రి సమ్మెను విరవించారు. 2023 డిసెంబర్ 11న ప్రారంభమైన సమ్మె 2024 జనవరి 22 వరకు కొనసాగింది. అయితే ఆ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన అంగన్వాడీ డిమాండ్లను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది.
అంగన్ వాడీ వర్కర్, హెల్పర్ మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు
అందులో భాగంగానే సర్వీసులో ఉన్న అంగన్ వాడీ వర్కర్, హెల్పర్ మరణిస్తే అంత్యక్రియ ఖర్చుల కోసం రూ.15 వేలు ఇచ్చిందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి జీవోఆర్టీ నెంబర్ 9ను విడుదల చేసింది. 2024 జనవరి 22న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నేతలు చేసిన చర్చల్లో అంగీకరించిన మేరకు రూ.15,000 అంత్యక్రియల ఖర్చులకు మంజూరు చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మొత్తాన్ని అంగన్వాడీ వర్కర్లు / హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు, కుటుంబ సభ్యులు, బంధువులకు అందజేస్తారు. ఏపీ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ ఉత్తర్వులు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతితోనే ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఒప్పందం ప్రకారం రూ.20 వేలకు పెంచాలి -యూనియన్ నేత
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగిన ఒప్పందం ప్రకారం అంత్యక్రియల ఖర్చులు రూ.20 వేలకు పెంచుతూ జీవో 9ని సవరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షురాలు జి.బేబీరాణి డిమాండ్ చేశారు. రూ.20 వేలు ఇవ్వాలనే సమ్మె డిమాండ్లో భాగంగా చర్చల్లో మంత్రులు రూ.15 వేలకు అంగీకరించారు. అయితే తాము కుదరదని రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాం.
అందుకు మంత్రులు కూడా అంగీకరించారు. కానీ ఇప్పుడు రూ.15 వేలు ఇస్తూ జీవో విడుదల చేశారు. ఇది సమంజసం కాదు. వెంటనే జీవోని సవరించి రూ.20 మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 13 డిమాండ్లు ప్రభుత్వం ముందు చర్చల్లో పెట్టామని, దాదాపుగా అన్ని డిమాండ్లకు మంత్రుల బృందం నుంచి అంగీకారం వచ్చిందని తెలిపారు. అందుకనుగుణంగానే అప్పుడు లిఖితపూర్వకంగా హామీ వచ్చిందన్నారు.
సమ్మె డిమాండ్లలో భాగంగా పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు. అలాగే ఆయాలకు పదోన్నతి వయస్సు సర్వీసులో చేరిన రెండేళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉండేదని, దాన్ని 50 ఏళ్లకు పెంచారు. సెక్టార్, ప్రాజెక్ట్ వారీ నెలకు రెండు సమావేశాలు జరుగుతాయని, వాటి టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అందులో నెలకు ఒక సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి టీఏ, డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పదవీ విరమణ ప్రయోజనం ఇది వరకు వర్కర్కు రూ.50 వేలు, హెల్పర్కు రూ.20 వేల ఉండేది. దాన్ని వర్కర్కు రూ.1,20,000, హెల్పర్కు రూ.75 వేలకు పెంచారు.
మినీ నుంచి మెయిన్ సెంటర్లుగా
రాష్ట్రంలోని ఉన్న 8,632 మినీ అంగన్ వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లగా మార్చాలని సమ్మె డిమాండ్లలో ఒకటి. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. మినీ సెంటర్లో పని చేసే అంగన్వాడీ వర్కర్ ఆయా జీతం 7,000 మాత్రమే ఇస్తున్నారు. అక్కడ ఆయా ఉండదు.
మెయిన్ సెంటర్గా మార్చితే అంగన్వాడీ వర్కర్ జీతం రూ.11,500కు పెరుగుతుంది. అక్కడ ఆయా పోస్టు భర్తీ చేస్తారు. అయితే రాష్ట్రంలోని దాదాపు 3,000 మినీ అంగన్ వాడీ సెంటర్లలో పదో తరగతి కంటే తక్కువ విద్యా అర్హత ఉన్నవారు అంగన్ వాడీ వర్కర్లుగా ఉన్నారు.
దీన్ని ఏం చేయాలని ప్రభుత్వం, యూనియన్ నేతలను అడిగింది. అందుకు యూనియన్ నేతలు రెండేళ్లు సమయం ఇవ్వాలని, ఈలోపు వారు పదోతరగతి పూర్తి చేసుకుంటారని ప్రతిపాదించారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన సెంటర్లను మెయిన్ సెంటర్లగా మార్చే ప్రక్రియకు సంబంధించిన ఫైల్ రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే అది అమలులోకి వస్తుంది. ఇలా అంగన్వాడీ సమ్మెకు సంబంధించిన డిమాండ్లు ఒక్కొక్కటి పరిష్కార రూపం దాల్చుతున్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్