




Best Web Hosting Provider In India 2024

Cyber Crime : న్యూడ్ కాల్స్, క్యూ ఆర్ కోడ్, చైన్ స్కీమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి -మెదక్ ఎస్పీ
Cyber Crime : రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. న్యూడ్ కాల్స్, క్యూ ఆర్ కోడ్, చైన్ స్కీం నేరాల పైన అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Cyber Crime : సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టకండి, ఎవరో చెప్పింది విని లేదా సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోకండన్నారు.

మీరు పెట్టుబడి పెట్టండి, మీ బంధుమిత్రులతో పెట్టుబడి పెట్టించి అధిక లాభాలు పొందండి అంటూ ఆశ చూపించే చైన్ ఇన్వెస్ట్మెంట్ మోసపూరితమైనదని గ్రహించాలని ఎస్పీ కోరారు. మెదక్ జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువ కావటంతో, ప్రజలందరూ ఇలాంటి నేరాల పైనా అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు.
క్యూఆర్ కోడ్ మోసాల పై అప్రమత్తం
ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తే నమ్మకండి అది సైబర్ మోసం అని గ్రహించాలని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఆన్లైన్ లోన్స్ గురించి లోన్స్ యాప్ లను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లు, ఫోటోలు, మీ వ్యక్తిగత వివరాలు యాప్ వారు మీ అనుమతి లేకుండా తీసుకుంటారన్నారు. తర్వాత మీరు తీసుకున్న లోన్ తిరిగి కట్టినా ఎక్కువ డబ్బులు కట్టమని ఆ వివరాలతో వేధింపులకు గురిచేస్తారన్నారు. ఈ విషయంలో జాగ్రత్త అని ఆన్లైన్ లోన్ ఆప్స్ ద్వారా లోన్స్ తీసుకోరాదని సూచించారు. లోన్ ఆప్స్ వేధింపులకు బాధపడి క్షణికావేశాలకు పోవద్దని కోరారు.
డబ్బులు పోతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు
సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తే…వెంటనే 1930 కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కస్టమర్ కేర్ నెంబర్ ను సంబంధిత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలన్నారు. సైబర్ నేరగాళ్లు గూగుల్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారన్నారు.
పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లలో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని ఎస్పీ సూచించారు. లాటరీ కూపన్లో నమోదు చేసే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఈ తరహా మోసాల బారినపడితే 1930 కి ఫోన్ చేయాలని అన్నారు.
న్యూడ్ కాల్స్ తో బెదిరింపులు
తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇన్ స్టాగ్రామ్ లో కానీ ఫేస్ బుక్ లో కానీ న్యూడ్ కాల్స్ చేసి రికార్డు చేస్తారన్నారు. ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాము ,ఫోటోలు పంపిస్తాం ,యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామంటూ ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చిందని, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారని తెలిపారు.
ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల మోసాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి, తోటి వారిని సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.
టాపిక్