‘పాకిస్థాన్​ దగ్గర ఆయుధాలే లేవ్​- యుద్ధం వస్తే 4 రోజుల్లో ఖతం!’

Best Web Hosting Provider In India 2024


‘పాకిస్థాన్​ దగ్గర ఆయుధాలే లేవ్​- యుద్ధం వస్తే 4 రోజుల్లో ఖతం!’

Sharath Chitturi HT Telugu

భారత్​ దాడి చేస్తే ప్రతిఘాటిస్తామని, అవసరమైతే యుద్ధానికి కూడా వెళతామని పాకిస్థాన్​ చెబుతోంది. కానీ నిజంగా యుద్ధం వస్తే పాక్​ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం 4 రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఓ నివేదిక చెబుతోంది.

పాకిస్థాన్​ ఆర్మీ (AP)

పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై భారత్​ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని, ఆ దాడిని తాము ప్రతిఘటిస్తామని పాకిస్థాన్​ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్​ దగ్గర యుద్ధం చేసే స్థాయిలో ఫిరంగి మందుగుండి సామాగ్రి లేదని వార్తా సంస్థ ఏఎన్​ఏ నివేదిక వెల్లడించింది. యుద్ధం వస్తే పాక్​ సైన్యం దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం 96 గంటలు (4 రోజులు) మాత్రమే కొనసాగుతాయని తెలిపింది. ఈ విషయం అక్కడి సైనిక వర్గాలనే ఆందోళనకు గురిచేస్తోందని నివేదిక పేర్కొంది.

పాకిస్థాన్​ దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు?

నివేదిక ప్రకారం.. పాకిస్థాన్​కు ఈ కొరత ఎదురవ్వడానికి కారణాల్లో ఒకటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.​​ ఇటీవల ఉక్రెయిన్​కి ఆయుధాల బదిలీ, ముఖ్యంగా 155 ఎంఎం ఆర్టిలరీ షెల్స్ ఎగుమతి వల్ల ఈ కొరత ఏర్పడింది. ఫిరంగి మందుగుండు సామాగ్రిలో పాకిస్థాన్​కు ఇవి చాలా కీలకం. పెరుగుతున్న ప్రపంచ డిమాండ్, లాభదాయక ఒప్పందాల మధ్య నిర్వహించిన ఈ ఎగుమతులు దేశ వ్యూహాత్మక నిల్వలను సైతం ఖాళీ చేశాయి. అంతేకాదు, శక్తివంతమైన ఎం 109 హోవిట్జర్లు, బీఎం -21 రాకెట్ వ్యవస్థల నిల్వలు కూడా దారుణంగా పడిపోయాయి.

కాలం చెల్లిన మౌలిక సదుపాయాలు, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం కారణంగా దేశంలోని ప్రధాన ఆయుధ ఉత్పత్తిదారు అయిన పాకిస్థాన్​ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (పీఓఎఫ్) పునరుద్ధరణ డిమాండ్లను కొనసాగించలేకపోతోంది! దేశీయ అవసరాలను తీర్చడానికి పీఓఎఫ్ ఫోకస్​ చేసినప్పటికీ అనేక కారణాల వల్ల అలా జరగలేదని ఓ అధికారి వెల్లడించారు.

మే 2న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్​లో ఈ పరిస్థితి తీవ్రత ప్రధాన అజెండాగా ఉందని నివేదిక పేర్కొంది. దీంతో పాక్ మిలిటరీ శ్రేణులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి.

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆర్థిక, లాజిస్టిక్ పరిమితులను ఉటంకిస్తూ నిరంతర యుద్ధానికి పాకిస్థాన్​ పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందని గతంలో హెచ్చరించారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం – పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రుణాలు, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు – ఇంధన కొరత కారణంగా శిక్షణ విన్యాసాలను నిలిపివేయడానికి, రేషన్ తగ్గించడానికి, షెడ్యూల్ చేసిన యుద్ధ క్రీడలను కూడా రద్దు చేయడానికి మిలిటరీని పాక్​ బలవంతం చేసింది.

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​ దాడి చేస్తే ప్రతిఘటించేందుకు పాకిస్థాన్​ కొత్త మందుగుండు సామాగ్రి నిల్వల డిపోలను సరిహద్దుకు సమీపంలో నిర్మిస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, వాటిని నింపడానికి తగినంత నిల్వలు లేకపోవడం గమనార్హం!

పాకిస్థాన్​ తన మందుగుండు సామగ్రిని సుదూర యుద్ధాలకు తరలించిందని, దాని ఆయుధ సంపత్తి ఖాళీగా ఉందని, డిఫెన్స్​ క్షీణించిందని సీనియర్ రక్షణ విశ్లేషకుడు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. స్వల్పకాలిక ఆర్థిక లబ్ది కోసం ప్రయత్నించడం దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు.

భారత్-పాక్ ఉద్రిక్తతలు..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ నివేదిక రావడం గమనార్హం. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది మృతి చెందారు.

ఉగ్రదాడి అనంతరం పాక్​పై భారత్ పలు కీలక చర్యలు ప్రకటించింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, అట్టారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేయడం, హైకమిషన్ల సిబ్బందిని తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి.

పాక్ పౌరులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలను రద్దు చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 30లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్ నడిపే విమానాల కోసం భారత్ తన గగనతలాన్ని మూసివేసింది.

ఇక పాకిస్థాన్​లో తయారైన, పాక్​ నుంచి వచ్చే అన్ని దిగుమతులను భారత్​ శనివారం నిషేధించింది. పాక్​ ఓడలు ఇండియా పోర్టుల్లో ఆగకూడదని, భారత్​కు చెందిన షిప్​లు ఆ దేశానికి వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link