




Best Web Hosting Provider In India 2024

‘బనకచర్లతో పక్క రాష్ట్రాలకు ఇబ్బంది లేదు – అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం – సీఎం చంద్రబాబు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… సముద్రంలో కలిసే నీళ్లనే ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతి ఇవ్వగానే పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తామన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో పోలవరంపై చర్చించినట్లు చెప్పారు. పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మళ్లీ రూ.980 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది లేదు – సీఎం చంద్రబాబు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చని అభిప్రాయపడ్డారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
“సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం . కేంద్రం అనుమతి ఇవ్వగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
“అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కోరాం. సానుకూలంగా స్పందించారు. ఆర్డీటీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. పూర్వోదయ పథకం మరికొన్ని నిధులు ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కోరాను. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశాను. మా ప్రతిపాదనలకు ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారు” అని చంద్రబాబు వెల్లడించారు.
ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. “రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి ఆయన సానుకూలంగా స్పందించారు. సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం. సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. ఈ స్కీమ్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కుసుమ్ కింద 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా మారబోతుంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్