





Best Web Hosting Provider In India 2024

రోజుకు ఒక పూట తిన్న రోజులు కూడా ఉన్నాయి.. మీరు నన్నేమీ చేయలేరు: ధనుష్ కామెంట్స్ వైరల్
తమిళ నటుడు ధనుష్ కుబేర ఆడియో లాంచ్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనను ద్వేషిస్తూ, నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లు తననేమీ చేయలేరని అన్నాడు. ఒకప్పుడు ఒకే పూట తిన్న రోజులు కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నాడు.
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన మూవీ కుబేర. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. అయితే ఆదివారం (జూన్ 1) ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ధనుష్ చేసిన కామెంట్స్ అభిమానులను ఆకర్షించాయి. తనను ద్వేషిస్తూ, తన సినిమాల రిలీజ్కు ముందు నెగటివ్ ప్రచారం చేసే వారికి అతడు గట్టి సందేశమే ఇచ్చాడు.
నన్నేమీ చేయలేరు
ఈ ఈవెంట్లో ధనుష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తనను ద్వేషిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి ఈ ఈవెంట్ వేదికపై నుంచి సందేశం పంపించాడు. “నా గురించి మీరు ఎన్నయిన పుకార్లు పుట్టించండి. ఎన్నయినా వ్యతిరేక వార్తలు ప్రచారం చేయండి. నా సినిమా రిలీజ్ కు ముందు ప్రతిసారి నెలన్నర రోజుల నుంచి ఈ నెగటివ్ ప్రచారం మొదలవుతుంది.
కానీ మీరేమీ చేయలేరు ఎందుకంటే నా అభిమానులే నాకు బలమైన మూలస్తంభాలు. వాళ్లు 23 ఏళ్లుగా నాతో ఉన్నారు. వాళ్లు నా స్నేహితులు. నా గురించి పుకార్లు పుట్టిస్తూ నన్ను పడగొట్టాలని మీరు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఒక్క ఇటుక కూడా కదపలేరు” అని ధనుష్ స్పష్టం చేశాడు. ధనుష్ ఈ మాట అనగానే అభిమానులు ఈలలు వేస్తే గోల గోల చేశారు.
ఒక పూట తిని బతికాను
ఒకప్పుడు తాను గడిపిన గడ్డు రోజులను కూడా ఈ సందర్భంగా ధనుష్ గుర్తు చేసుకున్నాడు. “మీరు ఎవరైనా సరే.. మీ ఆలోచనను బట్టే జీవితం మారుతుంది. మీకు దక్కాల్సింది కచ్చితంగా దక్కుతుంది. దానిని ఎవరూ దూరం చేయలేరు. సంతోషంగా ఉండండి. సంతోషం అనేది మన లోపల ఉంటుంది. ఒకప్పుడు నేను రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టపడ్డాను.
ఈరోజు మంచి స్థానంలో ఉన్నాను. అయితే ఎప్పుడూ నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే ఆనందాన్ని నేను బయట వెతుక్కోలేదు. నాలోనే వెతుక్కున్నాను. జీవితంలో శాంతి, సంతోషం కంటే విలువైనవి ఏవీ లేవు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. నా ప్రయాణం మొత్తం మీరు నాతోనే ఉన్నారు. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను” అని ధనుష్ అన్నాడు.
ధనుష్ ఎందుకిలా అన్నాడు?
కుబేర ఆడియో లాంచ్ ఈవెంట్లో ధనుష్ ఇలా ఎమోషనల్ అవడం వెనుక బలమైన కారణమే ఉంది. తనను ఎంతగానో ద్వేషించే నయనతార లక్ష్యంగానే అతడు ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో ధనుష్ లక్ష్యంగా నయనతారు సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. అప్పటి నుంచీ ధనుష్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. ఇలాంటి ఈవెంట్లలోనే వీటి గురించి మాట్లాడుతున్నాడు.
ఇక కుబేర మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాను రూ.120 కోట్లతో తెరకెక్కించారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. నాగార్జున, రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో నటించారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
సంబంధిత కథనం