Best Web Hosting Provider In India 2024

ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు – వారం రోజులపాటు ఛాన్స్..!
ఉద్యోగుల బదిలీల గడువుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విభాగాల ఉద్యోగుల బదిలీలు గడువును జూన్ 9వ తేదీ వరకు వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 10 నుంచి నిషేధం…
మరోవైపు జూన్ 10 నుండి ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈలోపే అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది.
నిజానికి ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మరో వారంపాటు పొడిగింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. అప్పటి వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ…. ఉత్తర్వులు ఇచ్చింది.
మార్గదర్శకాలు ఇవే…
ఇక ఈ సాధారణ బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని సర్కార్ స్పష్టం చేసింది. ఈ నిబంధన మేరకు చాలా మంది ఉద్యోగులు బదిలీ కానున్నారు. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని కూడా ట్రాన్స్ ఫర్ కానున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీల్లో…. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది.
గిరిజన ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. మెడికల్ గ్రౌండ్లో భాగంగా ఉద్యోగుల వినతి మేరకు బదిలీ చేయనుంది. స్పౌజ్ ఉద్యోగులకు బదిలీల్లో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యం కల్పించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శాల మేరకు… ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నాయి.
మరోవైపు కొన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అర్అండ్ బీ డిపార్ట్ మెంట్ లో కొందరు అధికారులు… కీలక పోస్టింగ్ల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమకు నచ్చిన చోట పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్క శాఖలోనే కాదు… వ్యవసాయశాఖలోనూ ఇదే మాదిరి పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో… ఉద్యోగ సంఘాలు గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో…. జూన్ 9 వరకు గడువు పెంచారు.