Best Web Hosting Provider In India 2024
‘దృశ్యం’ సినిమా చూసి మర్డర్ చేశాడు- మహిళ శరీరాన్ని కాల్చి, చెరువులో పడేసి..
క్రైమ్ సినిమాలను విపరీతంగా చూసే అలవాటు ఉన్న ఓ రాజస్థాన్వాసి.. నగల కోసం ఓ మహిళను చంపాడు. ఆ తర్వాత దృశ్యం సినిమా తరహాలో మృతదేహాన్ని తగలబెట్టాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలి నగలను దోచుకోవాలని చూసిన ఓ వ్యక్తి.. ఆమెను చంపి, ఆ తర్వాత దృశ్యం సినిమా తరహాలో మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. శరీరాన్ని దహనం చేసి, మృతదేహాన్ని చెరువులో పడేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
అసలేం జరిగిందంటే..
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు రమేష్ లోహర్ 5వ తరగతి డ్రాపౌట్. క్రైమ్ పెట్రోల్ వంటి థ్రిల్లర్లు, ట్రూ క్రైమ్ షోలు చూడటం అతనికి ఇష్టం. నగలు దొంగిలించాలనే ఉద్దేశంతో చాందీ బాయి అనే మహిళను చంపాలని నిర్ణయించుకున్నట్లు అతను పోలీసులకు చెప్పాడని ఉదయ్పూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ తెలిపారు.
ధోలీ వర్గానికి చెందిన చందీ బాయి జనవరి 9న ఓ కార్యక్రమంలో డ్రమ్స్ వాయిస్తుండగా నిందితుడు ఆమెను చూశాడు. ఆ సమయంలో ఆమె భారీ వెండి, బంగారు ఆభరణాలు ధరించింది.
ఓ ఫంక్షన్లో ప్రదర్శన ఇవ్వడానికి రూ.1,100 ఇస్తానని చాందీ బాయిని రమేష్ ఫిబ్రవరి 22న తన వ్యాన్లోకి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత గంటల తరబడి వ్యాన్ని తిప్పాడు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు తన మొబైల్ ఫోన్ని కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. రాత్రి సమయంలో నిందితుడు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి స్క్రూడ్రైవర్తో తలపై పలుమార్లు కొట్టి చంపేశాడు.
అనంతరం నిందితుడు ఆమె నగలు తీసి, ఆమె మొబైల్ ఫోన్ని స్విచ్ఛాఫ్ చేశాడు. ఆమె బ్యాగ్తో పాటు మొబైల్ ఫోన్ని సమీపంలోని అడవిలో పడేశాడు.
అనంతరం రమేష్ డంపింగ్ యార్డుకు వెళ్లి మృతదేహాన్ని శిథిలాలతో కప్పి నిప్పంటించి.. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి డంపింగ్ యార్డుకు వెళ్లి ఆ మహిళ అవశేషాలను సేకరించి చెరువులో పడేశాడు.
‘దృశ్యం’ సినిమా మాదిరిగానే మృతదేహం దొరక్కపోతే తాను పట్టుబడనని నిందితుడు అనుకున్నాడని ఏఎస్పీ తెలిపారు.
అయితే, డంపింగ్ యార్డులో మహిళ పుర్రెలోని చిన్న చిన్న ముక్కలను పోలీసులు కనుగొనడంతో ఈ వ్యవహారం బయటపడింది.
ఫోరెన్సిక్ విశ్లేషణలో రమేష్ వ్యాన్లో రక్తపు మరకలు, మానవ వెంట్రుకలు కూడా లభించాయి. అనంతరం చాందీ బాయి బెడ్ నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాలను సరిపోల్చినట్లు ఏఎస్పీ కుమార్ తెలిపారు.
చాందీ బాయి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన రెండు నెలల తర్వాత ఈ కేసు వెలుగుచూసింది.
పురోగతి లేకపోవడంతో ఆందోళన చెందిన చాందీబాయి బంధువులు ఉన్నతాధికారులను ఆశ్రయించి ఆమె హత్యకు గురై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ఏఎస్పీకి అప్పగించారు.
ఫిబ్రవరి 22న వెండి రంగు వ్యాన్లో చాందీబాయిని తీసుకెళ్లడాన్ని తాము చూశామని విచారణలో కొందరు పేర్కొన్నారు. తదుపరి విచారణలో ఈ వ్యాన్ నేరచరిత్ర కలిగిన స్థానిక కృత్రిమ ఆభరణాల వ్యాపారి రమేష్కు చెందినదిగా గుర్తించారు.
తొలుత రమేష్ను విచారించగా ఇందులో తన ప్రమేయం లేదని అతను వాదించాడు. కానీ చాందీ బాయి కాల్ రికార్డుల సాంకేతిక విశ్లేషణలో ఆమె అదృశ్యమైన రోజు ఇద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నట్లు తేలింది.
రమేష్కు నేరచరిత్ర ఉందని, అత్యాచారం కేసుతో పాటు జ్యుడీషియల్ కస్టడీకి కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
రమేష్ డిజిటల్ ఫుట్ప్రింట్స్ని పోలీసులు కనుగొన్నారు, అతను “దృశ్యం” సహా క్రైమ్ షోల గురించి గూగుల్ శోధించినట్లు తేలింది. మృతదేహం కుళ్లిపోవడానికి ఎంత సమయం పడుతుంది? మొబైల్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు నేరస్థులను ఎలా పట్టుకుంటారు? వంటి ప్రశ్నలను కూడా అతను శోధించాడని ఏఎస్పీ కుమార్ తెలిపారు.
అతనికి క్రైమ్ షోలు చూసే అలవాటు ఉందని, తరచూ అర్థరాత్రి సమయంలో చూసేవాడని నిందితుడి భార్య కూడా ధృవీకరించింది.
Best Web Hosting Provider In India 2024
Source link