




Best Web Hosting Provider In India 2024

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రామచంద్రు నాయక్..! ఆయన గురించి తెలుసా..?
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రానుంది. ఈ అవకాశాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏ క్షణమైనా నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కానుంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణతో పాటు కీలక పదవుల భర్తీపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిపెట్టింది. కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇద్దరు ఎస్సీ, ఒకరు బీసీ సామాజికవర్గం నుంచి ఉన్నారు. అయితే ఎస్టీ(లంబాడా) సామాజికవర్గం నుంచి కేబినెట్ లో ఎవరూ లేరు. దీంతో ఆ సామాజికవర్గానికి కీలకమైన పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు… తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ ఖరారయ్యారు. ఇయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నియామాకానికి సంబంధించి అసెంబ్లీ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ కాగానే… నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే.
రామచంద్రు నాయక్ నేపథ్యం:
- రామచంద్రు నాయక్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సమీపంలోని పెద్దవంగర మండలంలోని బొమ్మకల్ తాండలో జన్మించారు.
- ప్రస్తుతం డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు. ఎంఎస్ కూడా చేసిన ఆయన.. వైద్య సేవలు అందిస్తున్నారు.
- 2006లో తెలుగుదేశం పార్టీ ద్వారా రామచంద్రు నాయక్ రాజకీయాల్లోకి వచ్చారు.
- 2006లో టీడీపీ అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
- 2014లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.
- 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
- 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యా నాయక్ పై 53,131 ఓట్ల భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు.
- 2023 డిసెంబర్ 15న తెలంగాణ ప్రభుత్వం ఆయనను విప్గా నియమించింది.
టాపిక్