




Best Web Hosting Provider In India 2024
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు- అణు స్థావరాలే టార్గెట్!
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. అనంతరం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా- చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు! ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఇరాన్లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తేల్చిచెప్పింది. అణు బాంబును ఇరాన్ తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఈ దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తమపై దాడి చేసే అవకాశం ఉందంటూ.. ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఇరాన్లోని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్పై వైమానికి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రకటించారు.
“ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సెంటర్లో దాడి చేశాను. ఇరాన్పై మా దాడులు ఎన్ని రోజులు కొనసాగాలో, అన్ని రోజులు కొనసాగుతాయి,” అని నేతన్యాహు తేల్చిచెప్పారు.
అణ్వాయుధాల కోసం సహజ యురేనియంలో యురేనియం-235 ఐసోటోప్ కాన్సట్రేషన్ని పెంచే ప్రాసెస్, అది జరిగే ప్రాంతాన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని అంటారు.
వాస్తవానికి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఇరాన్లో జరుగుతోందని అమెరికా సహా దాని మిత్రపక్ష దేశాలు చాలా కాలంగా అనుమానిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ ప్రోగ్రామ్ని టార్గెట్ చేస్తూ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
అణ్వాయుధ స్థావరాలతో పాటు ఇరాన్కి చెందిన మిలిటరీ స్థావరలపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇరాన్లో భారీ పేలుడు- ఇజ్రాయెల్ పనే!
శుక్రవారం తెల్లవారుజామున పేలుళ్ల శబ్దాలకు ఇరాన్లోని టెహ్రాన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుళ్లు జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ సైతం అంగీకరించింది. శుక్రవారం దేశంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు కాట్జ్ తెలిపారు.
“ఇరాన్పై ఇజ్రాయెల్ ముందస్తు దాడుల నేపథ్యంలో మనపై మిసైల్ దాడులు లేదా డ్రోన్ దాడులు జరగొచ్చు,” అని కాట్జ్ అన్నారు.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 6 శాతానికి పైగా పెరిగింది.
అమెరికా ప్రమేయం ఉందా?
అమెరికా- ఇజ్రాయెల్ మధ్య అనాదిగా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు అమెరికా సాయం చేసిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పూర్తి వ్యవహారంపై వైట్హౌస్ ఇంకా స్పందించలేదు. అయితే, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో అమెరికాకు సంబంధం లేదని అగ్రరాజ్య అధికారులు స్పష్టం చేస్తున్నారు.
“ఈ రోజు ఇరాన్పై ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయంతో దాడులు చేసింది. ఇరాన్పై దాడులకు మాకు (అమెరికా) ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రాంతంలోని మా సైన్యాన్ని రక్షించుకోవడం ఇప్పుడు మా ప్రధాన లక్ష్యం,” అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రిమార్కో రుబియో తెలిపారు.
“ఇంకోసారి స్పష్టంగా చెబుతున్నాను. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితో మాకు సంబంధం లేదు. అందుకే, అమెరికాపై, అమెరికా పౌరులను ఇరాన్ టార్గెట్ చేయకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ పాత్ర లేదని పేరు చెప్పని ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు సైతం మీడియాకు వెల్లడించారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల కన్నా ముందు, వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
“కచ్చితంగా జరుగుతుందని చెప్పను. కానీ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది (ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి). కానీ అణ్వాయుధ విషయంలో ఇరాన్తో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒప్పందానికి దగ్గరగా ఉన్నాము. ఈ సమయంలో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఒప్పందం కూలిపోవచ్చు. అందుకే వారు గొడవకు దిగకూడదు అనుకుంటున్నాను,” అని ట్రంప్ అన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link