ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై ఇజ్రాయెల్​ వైమానిక దాడులు- అణు స్థావరాలే టార్గెట్​!

Best Web Hosting Provider In India 2024


ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై ఇజ్రాయెల్​ వైమానిక దాడులు- అణు స్థావరాలే టార్గెట్​!

Sharath Chitturi HT Telugu

ఇరాన్​పై ఇజ్రాయెల్​ వైమానిక దాడులు చేసింది. అనంతరం ఇజ్రాయెల్​ రక్షణ మంత్రి కాట్జ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఇజ్రాయెల్​ ప్రధాని నేతన్యాహు (REUTERS file)

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, అమెరికా- చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు! ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్​ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఇరాన్​లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తేల్చిచెప్పింది. అణు బాంబును ఇరాన్​ తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఈ దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. ఇరాన్​ కూడా తమపై దాడి చేసే అవకాశం ఉందంటూ.. ఇజ్రాయెల్​లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఇరాన్​లోని న్యూక్లియర్​ ఎన్​రిచ్​మెంట్​ ప్రోగ్రామ్​పై వైమానికి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహు ప్రకటించారు.

“ఇరాన్​ న్యూక్లియర్​ ఎన్​రిచ్​మెంట్​ ప్రోగ్రామ్​ సెంటర్​లో దాడి చేశాను. ఇరాన్​పై మా దాడులు ఎన్ని రోజులు కొనసాగాలో, అన్ని రోజులు కొనసాగుతాయి,” అని నేతన్యాహు తేల్చిచెప్పారు.

అణ్వాయుధాల కోసం సహజ యురేనియంలో యురేనియం-235 ఐసోటోప్ కాన్సట్రేషన్​ని పెంచే ప్రాసెస్​, అది జరిగే ప్రాంతాన్ని న్యూక్లియర్​ ఎన్​రిచ్​మెంట్​ ప్రోగ్రామ్​ అని అంటారు.

వాస్తవానికి ఇలాంటి ప్రోగ్రామ్​ ఒకటి ఇరాన్​లో జరుగుతోందని అమెరికా సహా దాని మిత్రపక్ష దేశాలు చాలా కాలంగా అనుమానిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ ప్రోగ్రామ్​ని టార్గెట్​ చేస్తూ ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులు చేసింది.

అణ్వాయుధ స్థావరాలతో పాటు ఇరాన్​కి చెందిన మిలిటరీ స్థావరలపైనా ఇజ్రాయెల్​ దాడులు చేసింది.

ఇరాన్​లో భారీ పేలుడు- ఇజ్రాయెల్​ పనే!

శుక్రవారం తెల్లవారుజామున పేలుళ్ల శబ్దాలకు ఇరాన్​లోని టెహ్రాన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుళ్లు జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ సైతం అంగీకరించింది. శుక్రవారం దేశంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు కాట్జ్​ తెలిపారు.

“ఇరాన్​పై ఇజ్రాయెల్​ ముందస్తు దాడుల నేపథ్యంలో మనపై మిసైల్ దాడులు లేదా డ్రోన్​ దాడులు జరగొచ్చు,” అని కాట్జ్​ అన్నారు.

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో బెంచ్​మార్క్​ బ్రెంట్ క్రూడ్ 6 శాతానికి పైగా పెరిగింది.

అమెరికా ప్రమేయం ఉందా?

అమెరికా- ఇజ్రాయెల్​ మధ్య అనాదిగా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులకు అమెరికా సాయం చేసిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పూర్తి వ్యవహారంపై వైట్​హౌస్​ ఇంకా స్పందించలేదు. అయితే, ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులతో అమెరికాకు సంబంధం లేదని అగ్రరాజ్య అధికారులు స్పష్టం చేస్తున్నారు.

“ఈ రోజు ఇరాన్​పై ఇజ్రాయెల్​ ఏకపక్ష నిర్ణయంతో దాడులు చేసింది. ఇరాన్​పై దాడులకు మాకు (అమెరికా) ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రాంతంలోని మా సైన్యాన్ని రక్షించుకోవడం ఇప్పుడు మా ప్రధాన లక్ష్యం,” అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రిమార్కో రుబియో తెలిపారు.

“ఇంకోసారి స్పష్టంగా చెబుతున్నాను. ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడితో మాకు సంబంధం లేదు. అందుకే, అమెరికాపై, అమెరికా పౌరులను ఇరాన్​ టార్గెట్​ చేయకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్​పై ఇజ్రాయెల్​ వైమానిక దాడుల్లో తమ పాత్ర లేదని పేరు చెప్పని ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు సైతం మీడియాకు వెల్లడించారు.

ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడుల కన్నా ముందు, వైట్​హౌస్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్​- ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.

“కచ్చితంగా జరుగుతుందని చెప్పను. కానీ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది (ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి). కానీ అణ్వాయుధ విషయంలో ఇరాన్​తో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒప్పందానికి దగ్గరగా ఉన్నాము. ఈ సమయంలో ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి చేస్తే ఒప్పందం కూలిపోవచ్చు. అందుకే వారు గొడవకు దిగకూడదు అనుకుంటున్నాను,” అని ట్రంప్​ అన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link