ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు… ఏపీ ఇంధన శాఖలో ఏం జరుగుతోంది…!

Best Web Hosting Provider In India 2024

ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు… ఏపీ ఇంధన శాఖలో ఏం జరుగుతోంది…!

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

ఏపీ ఇంధన శాఖలో తాత్కాలిక ఉద్యోగుల పెత్తనం సాగుతోంది. లక్షల కోట్ల ఖరీదైన ప్రాజెక్టుల బాధ్యతల్ని అనుభవం లేని వారికి, కన్సల్టెంట్లకు అప్పచెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో జరుగుతున్న నియామకాలు, విధుల కేటాయింపులో మతలబు ఏమిటనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.

ఇంధన ప్రాజెక్టుల్లో కొరవడిన ఐఏఎస్‌ల పర్యవేక్షణ

ఏపీలో ఇంధన రంగంలో పురోగతి సాధించేందుకు ప్రైవేట్‌ భాగస్వామ్యంతో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో సాగుతున్నాయి.ఏపీ జెన్‌కో పరిధిలోని సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ద్వారా ప్రైవేట్‌ పెట్టుబడులతో ఈ ప్రాజెక్టుల్ని చేపడుతున్నారు. ప్రస్తుతం ఇంధన శాఖలో కీలక నిర్ణయాలన్నీ ఓ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వీటిపై ఐఏఎస్‌ల పర్యవేక్షణ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా ఏపీలో సోలార్‌, గ్రీన్‌ ఎనర్జీ, పంప్డ్‌ స్టోరేజీ వంటి పద్ధతుల్లో విద్యుతుత్పత్తి కోసం భారీ పెట్టుబడులతో ప్రాజెక్టుల్ని చేపట్టారు. భవిష్యత్‌లో ఏర్పడే విద్యుత్‌ డిమాండ్‌‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి సాధించడంతో పాటు గ్రిడ్‌ అవసరాలను తీర్చేలా భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. దాదాపు రూ.3లక్షల కోట్ల ఖరీదు చేసే ప్రాజెక్టుల్ని ఏపీ ఇంధన శాఖ ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉన్నాయి.

పునరుద్దరణీయ ఇంధన వనరులకు ప్రాధాన్యత…

ప్రస్తుతం ఏపీలో నిర్మిస్తున్న నూతన ఇంధన వనరుల ప్రాజెక్టుల్లో విండ్‌ పవర్‌, సోలార్ పవర్‌, స్మాల్ హైడ్రో, బయో మాస్‌ బేస్డ్‌ ప్రాజెక్టులు, బయో ఎనర్జీ కో జనరేషన్‌, మునిసిపల్ సాలిడ్‌ వేస్ట్‌,ఇండస్ట్రీయల్ వేస్ట్‌ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 2024-25 నాటికి ఈ ప్రాజెక్టుల ద్వారా 9982.489 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. 2025-26లో ఇప్పటి వరకు మరో 36మెగావాట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 10వేల మెగావాట్ల విద్యుత్‌ను ఈ శాఖ చేరుకుంది.

మరోవైపు రాష్ట్రంలో దాదాపు రూ.3లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని నెడ్‌కాప్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. వీటి నిర్వహణ, ప్రాజెక్టుల పర్యవేక్షణ, విద్యుత్ కొనుగోళ్లు వంటి అంశాలపై ఐఏ‎‎ఎస్‌ అధికారుల పర్యవేక్షణ తప్పించడం ఎందుకనే చర్చ జరుగుతోంది.

బాధ్యతల కేటాయింపులో మతలబు…

ఆంధ్ర ప్రదేశ్‌ ఇంధన రంగంలో పురోగతిని సాధించేందుకు కొత్త తరహా ప్రాజెక్టులకు కొన్నేళ్లుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసే సంస్థలను ఐఏ‎ఎస్‌ అధికారులనూ, అయా శాఖల్లో నిష్ణాతులైన వారికి బాధ్యతలు అప్పగిస్తుంటారు.

ప్రస్తుతం NREDCAP వీసీ, ఎండీగా ఉన్న కమలాకర్ బాబు గతంలో సోలార్ పవర్ కార్పొరేషన్ కు ఎండీగా ఉండేవారు. అప్పట్లో NREDCAP ఎండీగా ఐఏఎస్ అధికారి చక్రధర బాబు ఉండేవారు. నెడ్‌కాప్‌ ఎండీకి మరో అధికారికి పొసగక పోవడంతో ఆయనను కేవలం జెన్కోకు మాత్రమే పరిమితం చేశారనే ప్రచారం ఇంధన శాఖలో ఉంది.

ఆ తర్వాత అనూహ్యంగా నెడ్‌కాప్‌ విసీఎండీ బాధ్యతలు కమలాకర్ బాబుకు అప్పగించారు. ఆయనకు ఇంధన శాఖతో ఎలాంటి సంబంధం, అనుభవం లేకున్నా కీలక బాధ్యతలు అప్పగించేశారు. ఐఏఎస్‌ అధికారులు నిర్వహించాల్సిన కీలక బాధ్యతల్ని వైద్య శాఖలో రిటైర్ అయిన ఒక గ్రూపు 4 అధికారికి అప్పగించడం వెనుక ఏమి జరిగిందనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది.

అర్హులైన వారే లేరా?

ఏపీలో కీలకమైన నూతన ఇంధన వనరుల శాఖకు విద్యుత్‌ రంగంలో అనుభవం, అర్హతలు ఉన్న అధికారుల్ని నియమించక పోవడం వెనుక గుట్టు ఏమిటనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. వైద్య శాఖకు చెందిన రిటైర్డ్‌ అధికారిని NREDCAP వీసీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్‌, ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఇంధన శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఉండటంతో ఇంధన శాఖ బాధ్యతలు కూడా సీఎస్‌ చేతిలోనే ఉన్నాయి.

మరోవైపు నూతన, పునరుద్దరణీయ ఇంధన శాఖకు తగినంత మంది శాశ్వత ఉద్యోగులు లేక పోవడంతో ఇతర శాఖల ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. లక్షల కోట్ల రుపాయల ప్రాజెక్టులు సాగుతున్న ఈ శాఖలో దానికి సంబంధం లేని వ్యక్తిని వీసీ-ఎండీగా నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమైన సమయంలో పదవీ విరమణ చేసిన మరో అధికారిని జిఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇంధన రంగానికి సంబంధం లేని వ్యక్తిని నెడ్‌కాప్‌ వీసీ- ఎండీగా నియమించడం, జిఎం స్థాయిలో మరో అధికారిని నియమించడం వెనుక ఇంధన శాఖ పెద్దల వ్యూహం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగుల నియామక ఉత్తర్వుల్లో ఆ శాఖకు చెందిన ఫైల్స్ మొత్తం ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్లాలో కూడా ఉత్తర్వుల్లో నిర్దేశించడంలోనే అసలు మతలబు ఉన్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్వహిస్తున్న నూతన, పునరుద్దరణీయ ఇంధన వనరుల శాఖ బాధ్యతల్ని ఐఏఎస్‌లకు కాకుండా బయటి వ్యక్తులకు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కీలక నిర్ణయాలకు దూరంగా ఇంధన శాఖ మంత్రి…

ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్‌ ఉన్నా ఆయనకు సంబంధం లేకుండానే ఆ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ అమలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ప్రభుత్వంలో అన్ని శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలపై రిమోట్‌ మరో చోట ఉండటంతో విద్యుత్ శాఖ మంత్రి కూడా ముఖ్యమైన నియామకాలను, నిర్ణయాలను పట్టించుకోవడం మానేసినట్టు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా ఇంధన శాఖను శాసిస్తోన్న వ్యక్తి కనుసన్నల్లోనే అన్ని నియామకాలు జరుగుతుండటంపై మంత్రి కూడా కినుక వహించినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను అర్హత లేని వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక ఇతర ఉద్దేశాలు ఉన్నాయని ఇంధన శాఖలో ప్రచారం జరుగుతోంది.

పెట్టుబడులు, ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వెలుగు చూడకుండా అస్మదీయులకు కీలక బాధ్యతలు అప్పగించారని ఈ పరిణామాలతో విసుగు చెందిన మంత్రి కూడా వాటికి దూరంగా ఉంటున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

ElectricityAndhra Pradesh NewsTelugu NewsGovernment Of Andhra PradeshTdpAp MinistersYsrcp
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024