భారత్-పాక్ కాల్పుల విరమణ ఘనత నుంచి కాస్త వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్; అది ఆ ఇద్దరు తెలివైన నేతల నిర్ణయమని వ్యాఖ్య

Best Web Hosting Provider In India 2024


భారత్-పాక్ కాల్పుల విరమణ ఘనత నుంచి కాస్త వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్; అది ఆ ఇద్దరు తెలివైన నేతల నిర్ణయమని వ్యాఖ్య

Sudarshan V HT Telugu

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు ఆతిథ్యం ఇచ్చిన అనంతరం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Bloomberg)

భారత్- పాక్ ల మధ్య భారీ యుద్ధం జరిగే ప్రమాదాన్ని తానే నివారించానని పలుమార్లు పలు వేదికలపై చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కాస్త వెనక్కు తగ్గారు. తన వల్లనే ఆ యుద్ధం ఆగిందని చెప్పకుండా, ఆ సమయంలో ఆ రెండు దేశాల నాయకులకు ట్రేడ్ డీల్స్ ఆఫర్ చేశానని చెప్పారు. అయితే, కాల్పుల విరమణ నిర్ణయం ఆ ఇద్దరు “చాలా తెలివైన” నాయకులు తీసుకున్నారని స్పష్టం చేశారు.

పాక్ ఆర్మీ చీఫ్ కు వైట్ హౌస్ లో విందు

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు వైట్ హౌస్ లో లంచ్ ఇచ్చిన అనంతరం బుధవారం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “నేను అతన్ని (పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్) ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం, యుద్ధంలోకి వెళ్ళనందుకు, యుద్ధాన్ని ముగించినందుకు నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని మీకు తెలుసు, అలాగే, పాక్ తో వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాం’’ అని ట్రంప్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, జనరల్ అసిమ్ మునీర్ లను ప్రస్తావిస్తూ, ” వారు ఇద్ధరు చాలా తెలివైన వ్యక్తులు” అన్నారు. భారతదేశం మరియు పాకిస్తాన్ నాయకులు అణు యుద్ధంగా మారే ఘర్షణ నుండి వైదొలగాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు.

ట్రంప్, మోదీ ఫోన్ కాల్

మే 10న సైనిక సంఘర్షణను నిలిపివేయాలని నిర్ణయించిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి తాను సహాయం చేశానని ట్రంప్ పదేపదే పేర్కొన్నారు. అణ్వస్త్రాలు కలిగిన రెండు పొరుగు దేశాలు యుద్ధాన్ని ఆపితే అమెరికా వారితో చాలా వాణిజ్యం చేస్తుందని తాను వారికి చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కెనడాలోని కననాస్కిస్లో జరుగుతున్న జీ7 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ భేటీ కావాల్సి ఉండగా, షెడ్యూల్ కంటే ముందుగానే ఆయన వాషింగ్టన్ కు చేరుకున్నారు. అయితే, మోదీతో ఆయన సుమారు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత ఆ ఇద్దరు నాయకులు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.

ట్రేడ్ డీల్ ప్రస్తావన లేదు

ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి గానీ, భారత్-పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం కోసం ఎలాంటి ప్రతిపాదన గురించి గానీ ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదని మోదీ ట్రంప్ కు స్పష్టంగా తెలియజేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక వీడియో సందేశంలో తెలిపారు. సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయం భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉన్న మిలిటరీ-టు-మిలిటరీ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా నేరుగా వచ్చిందని, ఇస్లామాబాద్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మిస్రీ స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని మోదీ గట్టిగా చెప్పారని, ఈ వైఖరిపై దేశంలో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని ఆయన అన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link