




Best Web Hosting Provider In India 2024

విశాఖకు ‘కాగ్నిజెంట్’ క్యాంపస్ – 99 పైసలకే ఎకరా భూమి….!
విశాఖపట్నం కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. రూ.1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ కొలువుదీరనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం – కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా… 1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నారు. ఫలితంగా 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
99 పైసలకే ఎకరా భూమి…!
ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన కాగ్నిజెంట్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. కేవలం 99 పైసలకే ఆ సంస్థకు ఎకరా భూమి కేటాయించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కొన్ని నెలల కిందట విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూములను రూపాయికే కేటాయించటం సర్వత్రా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
కాగ్నిజెంట్ మార్చి 2029 నాటికి విశాఖపట్నంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం కాగ్నిజెంట్ సంస్థకు కాపులప్పాడు సమీపంలో 21.31 ఎకరాల భూమిని ఏపీ సర్కార్ కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో విశాఖను ఏపీలో కొత్త ఐటీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని నెలల కిందటే ఐటీ మంత్రి లోకేశ్ దావోస్ లో పర్యటించారు. ఆ సమయంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ని లోకేశ్ కలిశారు. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే…. విశాఖ కేంద్రంగా కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది.
టాపిక్