



Best Web Hosting Provider In India 2024

‘ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి’ – పోలవరంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
ఏపీలో కలిపిన పోలవరం ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంపై తెలంగాణ సర్కార్… కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏపీలో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈనెల 25వ తేదీన తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధానమంత్రి మోదీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు.
మునిగిపోయే ప్రమాదం ఉంది – ఎమ్మెల్సీ కవిత
పోలవరం ముంపు, భద్రాచలం సమీపంలోని ఐదు విలీన గ్రామాల అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమాశంలో కవిత మాట్లాడుతూ…. ఏపీలో కలిపిన గ్రామాల్లోని ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతూ ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నారని వివరించారు.
కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని కవిత వ్యాఖ్యానించారు. లేదంటే ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని తెలిపారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు.
న్యాయ పోరాటం చేస్తాం…
ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడి భూమి వెయ్యి ఎకరాలు ఉందని కవిత ప్రస్తావించారు. వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయిందని… దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు అని తెలిపారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలవరం ముంపుపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలని కవిత సూచించారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని కవిత గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో లో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ ను ఆమోదించి అన్యాయం చేశారని విమర్శించారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నారు. లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజెప్పారని మండిపడ్డారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరూ పార్లమెంటులో మాట్లాడామన్నారు.
టాపిక్