




Best Web Hosting Provider In India 2024

నిహారిక విడాకులు నా తప్పే.. అసలు ఆ పెళ్లే చేయాల్సింది కాదు.. మళ్లీ పెళ్లి అప్పుడే: నాగబాబు కామెంట్స్ వైరల్
తన కూతురు నిహారిక కొణిదెల పెళ్లి, విడాకుల్లో తప్పు తనదేనని అన్నాడు నాగబాబు. అసలు ఆ పెళ్లే చేయాల్సింది కాదని, తన అంచనా తప్పిందని అతడు అనడం గమనార్హం. అతడు హిట్ టీవీ స్పెషల్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్న విషయం తెలుసు కదా. ఆమె 2023లో వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో మూడు సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికింది. తాజాగా, హిట్ టీవీ స్పెషల్స్తో ఒక ఇంటర్వ్యూలో నాగబాబు తన కుమార్తె విడాకుల గురించి మాట్లాడాడు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న విషయాలనూ వెల్లడించారు.
పిల్లల సంతోషమే కావాల్సింది
తన పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక వృత్తిపరమైన నిర్ణయాలలో తాను జోక్యం చేసుకోనని, పరిశ్రమలో వారికి సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడానికి అనుమతిస్తానని నాగబాబు తెలిపాడు. ప్రతి తల్లిదండ్రులు తమ అంచనాలతో పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారి ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలని సలహా ఇచ్చాడు.
“నా పిల్లల సినిమాలు హిట్టయినా, ఫ్లాపయినా నాకు పట్టింపు లేదు. వారి సంతోషమే నాకు ముఖ్యం. వారు సంతోషంగా లేకపోతే కోట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటి?” అని నాగబాబు అనడం విశేషం.
నిహారిక కొణిదెల విడాకులపై..
తన కుమారుడు వరుణ్.. లావణ్యతో సంతోషంగా ఉంటాడా, ఆమెతో భవిష్యత్తును పంచుకుంటాడా అని అడిగిన తర్వాతే వారి పెళ్లికి అంగీకరించానని నాగబాబు చెప్పాడు. అయితే, నిహారిక విషయంలో తన నిర్ణయం తప్పని అంగీకరించాడు. చైతన్యతో ఆమె విడాకుల గురించి వివరిస్తూ.. “నిహారిక విషయంలో, నా నిర్ణయం తప్పయింది. ఆ పెళ్లి మా తప్పే. మేము దానిని సరిగా అంచనా వేయలేకపోయాం. మేము పెళ్లికి బలవంతం చేయలేదు. పెళ్లి ప్రతిపాదన వచ్చినప్పుడు, ఆమె అంగీకరించింది. అది బాగుంటుందని అనుకున్నాం.
కానీ వారు ఒకరితో ఒకరు సరిగా సమన్వయం చేసుకోలేకపోయారు. పరస్పర నిర్ణయంతో విడిపోయారు. నేను వారిని కలిసి ఉండేలా ఎప్పుడూ ప్రయత్నించలేదు. బలవంతం చేయలేదు. వారు సంతోషంగా లేరు. కలిసి ఉండాలని కోరుకోలేదు. వారి నిర్ణయంతో నేను అంగీకరించాను. ప్రస్తుతం, నిహారిక సినిమాలు నిర్మించడంలో బిజీగా ఉంది. ఆమె తన జీవితంలో ఏదో ఒక సమయంలో మరొక అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటుంది. అంతే” అని నాగబాబు స్పష్టం చేశాడు.
నిహారిక చైతన్య పెళ్లి, విడాకులు
నిహారిక, చైతన్య డిసెంబర్ 2020లో ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, 2023లో వారు విడిపోయారు.
నిహారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా చైతన్యతో తన విడాకులను అనౌన్స్ చేశారు. ఆమె తన ప్రకటనలో ఇలా రాసింది. “చైతన్య, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు ప్రైవసీ కావాలని కోరుతున్నాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని నిహారిక అప్పట్లో రాసింది.
సంబంధిత కథనం