పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావన లేదు.. చైనాలో ఎస్‌సీఓ పత్రంపై సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్

Best Web Hosting Provider In India 2024


పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావన లేదు.. చైనాలో ఎస్‌సీఓ పత్రంపై సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్

Anand Sai HT Telugu

పహల్గామ్ ప్రస్తావన లేకుండా షాంఘై సహకార సంస్థ(SSO) పత్రాలు ఉండటంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేయలేదు. ఈ కారణంగా సంయుక్త ప్రకటన రద్దు చేయాల్సి వచ్చింది.

రాజ్‌నాథ్ సింగ్ (AP)

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా పర్యటనలో ఉన్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు జరిగింది. భారత్, చైనా, పాకిస్థాన్‌తోపాటుగా పది సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఆ తర్వాత జాయింట్ డాక్యుమెంట్ సిద్ధం చేయగా.. అందులో పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావన లేదు. దీంతో ఆ పత్రంపై రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేయలేదు.

పత్రాల్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించలేదు. ఇది 26 మంది ప్రాణాలను బలిగొంది. ఆ పత్రంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించకపోయినా.. బలూచిస్తాన్‌ను చేర్చారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఉమ్మడి ప్రకటన ఉగ్రవాదంపై భారతదేశం బలమైన వైఖరిని వినిపించింది. అయినా పత్రాల్లో ప్రతిబింబించలేదు.

‘ఉమ్మడి ప్రకటన, ప్రోటోకాల్ ఉగ్రవాద సమస్యను ప్రస్తావించలేదు. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించారు. పాకిస్థాన్, చైనా ఈ పత్రంలో ఉగ్రవాద సమస్యను నీరుగార్చడానికి ప్రయత్నించాయి. దీనికి వ్యతిరేకంగా భారతదేశం బలమైన, దృఢమైన వైఖరిని తీసుకుంది.’ అని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్ ఆదేశం మేరకు పహల్గామ్ ఉగ్రవాద దాడిని పత్రం నుండి మినహాయించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైనా దానికి మిత్రదేశంగా ఉంది. మరోవైపు బలూచిస్తాన్‌లో తమ ప్రమేయం గురించి పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారతదేశం పదే పదే తిరస్కరించింది.

ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను చర్చించడానికి షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి రష్యా, పాకిస్థాన్, చైనాతో సహా సభ్య దేశాలు హాజరవుతున్నాయి. 2001లో స్థాపించిన ఈ కూటమిలో 10 సభ్య దేశాలు ఉన్నాయి. బెలారస్, చైనా, భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్.

అంతకుముందు రోజు, రక్షణ మంత్రి ఈ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎస్‌సీఓ సభ్యులు ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాస లోటుకు సంబంధించినవని, ఈ సమస్యలకు మూలకారణం తీవ్రవాదం, ఉగ్రవాదం అని ఆయన అన్నారు.

‘ఉగ్రవాదాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం స్పాన్సర్ చేసే, పెంచే, ఉపయోగించుకునే వారు దాని పరిణామాలను భరించాలి. కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగిస్తాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్‌సీఓ అటువంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు.’ అని రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link